ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ అరుదైన రికార్డు
అమరావతి: ఏ గవర్నర్ అయినా తన పదవీ కాలంలో ఒకరు లేదా ఇద్దరిని వేర్వేరుగా ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అది సహజం. పదవీ కాలం మొత్తానికీ ఇద్దరితో ప్రమాణ స్వీకారం చేయించడం అంటే గొప్పగా చెప్పుకోవచ్చు. అలాంటిది- తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఏకంగా నలుగురు రాజకీయ నేతలను ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. నలుగురు రాజకీయ నేతలతో అయిదుసార్లు ప్రమాణ స్వీకారం చేయించిన ఘనతను సాధించబోతున్నారు. ఓ రకంగా ఇది అరుదైన రికార్డుగా చెప్పుకోవచ్చు.
తొలుత ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. 2010 నవంబర్ 25వ తేదీన నరసింహన్ హైదరాబాద్లోని రాజ్భవన్లో కిరణ్ కుమార్ రెడ్డితో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తరువాత 2014లో రాష్ట్రం రెండుగా విడిపోయింది. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కే చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులుగా ఎన్నికయ్యారు. వారిద్దరితో వేర్వేరుగా నరసింహన్ ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు.
గత ఏడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించింది. వరుసగా రెండోసారి అధికార పీఠాన్ని అధిష్ఠించింది. ఈ సందర్భంగా కేసీఆర్తో రెండోసారి ప్రమాణ స్వీకారం చేయించారు. తాజాగా ఈ జాబితాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి చేరారు. గురువారం మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్తో నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించబోతున్నారు. ఈ రకంగా నలుగురు రాజకీయ నేతలతో వేర్వేరుగా అయిదుసార్లు ప్రమాణస్వీకారం చేయించిన అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నారు.