హెచ్చరికలు, భయం: గవర్నర్ పాలనలో హైదరాబాద్?
హైదరాబాదును పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచి శాంతి భద్రతలు బాధ్యతలను గవర్నర్ పరిధిలో ఉంచడం మంచిదని సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది. తమ పరిధిలోని శాంతిభద్రతలు, హైదరాబాదుకు సంబంధించిన వివిధ సమస్యలు, వాటికి పరిష్కారాలను సూచించిన హోంశాఖ నీటి పంపకాలు ఉద్యోగులు, ప్రయివేటు రంగం, కొత్త రాజధాని ఏర్పాటు, విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు తదితర అనేక సమస్యలను ప్రస్తావించింది. తీవ్రవాద సమస్యను ఎదుర్కొనేందుకు పలు సూచనలు చేసింది.
రాష్ట్రం ఏర్పాటు చేసినప్పటి నుండి సీమాంధ్ర నుండి పెద్ద ఎత్తున ప్రజలు తెలంగాణ ప్రాంతానికి, హైదరాబాదుకు తరలి వచ్చారని, నగరం అభివృద్ధి చెందడంతో చాలామంది సీమాంధ్ర పారిశ్రామికవేత్తలు ఫార్మా, రియల్ ఎస్టేట్, విద్య, ఐటి, అనుబంధ రంగాల్లో పెట్టుపడులు పెట్టారని తద్వారా ప్రయివేటు రంగంలోను ఉద్యోగార్థులకు దీనిని ముఖ్యమైన నగరంగా చేశారని, తెలంగాణలోని పలు జిల్లాల్లో కోస్తాంధ్ర రైతులు వ్యవసాయ భూములు కొనుగోలు చేసి ఇక్కడే స్థిరపడ్డారని అందులో తెలిపారు.
హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగం కావడం, పలువురు నేతల హెచ్చరికల నేపథ్యంలో టిలోని సీమాంధ్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయని, వాటిని పరిష్కరించాల్సి ఉందని పేర్కొంది.
రెండు కొత్త రాష్ట్రాల్లో స్థిరపడ్డ ప్రజల భద్రత, రక్షణల కోసం సరైన శాసన, చట్టబద్ధ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆందోళన అంతా హైదరాబాదు పైనే కేంద్రీకృతమైన నేపథ్యంలో హైదరాబాదుకు సంబంధించిన రక్షణ, భద్రత, శాంతిభద్రతలు, ఆస్తుల పరిరక్షణ తదితర అంశాలను కేంద్రం పరిధిలో అంటే రాష్ట్ర గవర్నర్ నియంత్రణలో ఉండేలా జివోఎం ఆలోచించవచ్చునని పేర్కొంది.
హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నంత కాలం హైదరాబాదు పోలీసు పరిపాలన అంతా గవర్నర్ పరిధిలో ఉంచవచ్చునని, తద్వారా హైదరాబాద్ సిటీ పోలీసులోని సీమాంధ్ర పోలీసులను ఎపి రాష్ట్రానికి తరలించే బదులు, ఇక్కడే ఉండవచ్చునని తెలిపింది.