ముట్టుకోవడం మర్చిపోయారు, పట్టుకోకుండా పది టెస్ట్లు: గవర్నర్
విజయవాడ: వైద్యాన్ని వ్యాపారంగా మార్చవద్దని, వైద్యులు సంపాదనే లక్ష్యంగా పని చేయవద్దని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ హితవు పలికారు. బుధవారం ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
రోగులు ఆసుపత్రికి రాగానే ఇన్సురెన్స్ ఉందా అని అడిగే విధానం మారాలన్నారు. వైద్యులు అనైతిక విధానాలను విడనాడాలన్నారు. చేయి పట్టుకోకముందే పదుల టెస్టులు రాయడం సరికాదన్నారు. అనవసరమైన వైద్య పరీక్షలు చేయవద్దన్నారు.
వైద్యులు ఎక్కువ ఫీజులు వసూలు చేయడం తగదని హితవు పలికారు. రోగిని ముట్టుకుని వైద్యం చేసే విధానాన్ని వైద్యులు మర్చిపోయారని, కేవలం పరీక్షల ద్వారానే రోగాన్ని తెలుసుకునేందుకు పరిమితమయ్యారన్నారు.
వైద్యులు మానవత్వంతో వ్యవహరించాలన్నారు. వైద్య పరికరాల ఖర్చు రాబట్టుకునేందుకని ఎక్కువ ఫీజు వసూలు చేయడం తగదన్నారు. ప్రతి ఆసుపత్రిలో చికిత్సకయ్యే ఖర్చు వివరాలను నోటీసు బోర్డులో ఉంచాలని సూచించారు.
రోగిని ముట్టుకుని వైద్యం చేసే విధానం వైద్యులు మరిచిపోయారని, కేవలం పరీక్షల ద్వారానే రోగాన్ని తెలుసుకునేందుకు పరిమితమయ్యారన్నారు. వైద్యులు తమ తీరు మార్చుకోవాలన్నారు. వైద్య వృత్తిలో విలువలు ఉండాలన్నారు. వైద్య వృత్తిని వ్యాపారంగా భావించే విధానం మారాలన్నారు. పేదలకు వైద్యం అందించేలా గ్రామీణ ప్రాంతాల్లోనూ పని చేయాలని సూచించారు.