భేటీలతో గవర్నర్ బిజీ బిజీ: సోనియాతో అరగంట భేటీ
న్యూఢిల్లీ: గవర్నర్ నరసింహన్ బుధవారం ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. విభజన నిర్ణయం నేపథ్యంలో రాష్ట్రంలోని తాజా పరిస్థితిపై గవర్నర్ ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకు వెళ్తున్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో నరసింహన్ దాదాపు అరగంట పాటు భేటీ అయ్యారు.
మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న గవర్నర్ బుధవారం ఉదయం పార్లమెంటులోని నార్త్ బ్లాకులో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ఆర్థిక మంత్రి చిదంబరంతో అరగంట పాటు భేటీ అయ్యారు. అనంతరం సోనియాతో సమావేశమయ్యారు. సోనియాతో విభజన, రాష్ట్ర తాజా పరిస్థితులపై అరగంట చర్చించారు.
మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేతో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో శాంతిభద్రతలు, తదితర అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. అనంతరం మంత్రుల బృందం(జివోఎం) సభ్యుడు నారాయణ స్వామితోను భేటీ అయ్యారు. నరసింహన్ సాయంత్రం ఆంటోని, రాహుల్ గాంధీలను కూడా కలవనున్నారు.
కాగా, తాను మర్యాద పూర్వకంగానే ఢిల్లీలో పలువురిని కలుస్తున్నానని, భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని నరసింహన్ అన్నారు. సాయంత్రం రాష్ట్రపతిని కలవనున్నట్లు చెప్పారు.
రేపు ఢిల్లీకి సీమాంధ్ర కాంగ్రెసు నేతలు
కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర నేతలు పలువురు గురువారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రులు శైలజానాథ్, టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, గంటా శ్రీనివాస్లతో పాటు పలువురు నాయకులు రాష్ట్రపతిని, జివోఎం సభ్యులను కలవనున్నారు.
ప్రధాని, రాష్ట్రపతి అపాయింటుమెంట్ కోరిన టిడిపి
ఈ నెల 25, 26 తేదీల్లో టిడిపి సీమాంధ్ర నాయకులు రాష్ట్రపతి, ప్రధానమంత్రిలను కలిసే అవకాశముందు. వారి అపాయింటుమెంట్ను టిడిపి కోరింది. టిడిపి నేతలు రేపు ఢిల్లీకి బయలుదేరే అవకాశముంది.