మీరు లేకపోతే నేను లేను - రాజకీయాలు ఇందులోకి వస్తే : ఉద్యోగులతో సీఎం జగన్..!!
ఏపీ పీఆర్సీ సాధన సమితి నేతలు ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమయ్యారు. రెండు రోజులపాటు సుదీర్ఘంగా జరిగిన చర్చలు ఫలించడంతో పీఆర్సీ సాధన సమితి సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ప్రభుత్వం తమ కోరికలను మన్నించడంతో సమ్మెలోకి వెళ్లడం లేదని నేతలు ప్రకటించారు. సీఎం జగన్కు ఉద్యోగ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమయంలో సీఎం జగన్ ఉద్యోగ సంఘాల నేతల తో కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ ప్రభుత్వం మీది... మీ సహకారంతో మంచి చేయగలుగుతున్నానని వ్యాఖ్యానించారు. ఆర్థిక పరిస్థితుల వల్ల, కరోనా ప్రభావం వల్ల మీరు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చని చెప్పుకొచ్చారు. కాని ఎంతమేర మేలు చేయగలుగుతామో అన్నిరకాలుగా చేశామని చెప్పారు.

సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు ఇందులోకి వస్తే.. వాతావరణం దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. రాజకీయాలకు తావు ఉండకూడదంటూ సీఎం కీలక వ్యాఖ్య చేసారు. ఏదైనా సమస్య ఉంటే.. అనామలీస్ కమిటీకూడా ఉందని చెప్పుకొచ్చారు. ఎప్పుడైనా మీరు మీ సమస్యలను చెప్పుకోవచ్చని సూచించారు. ఉద్యోగ సమస్యలపై మంత్రుల కమిటీ కొనసాగుతుందని.. ఏ సమస్య ఉన్నా.. వారికి చెప్పుకోవచ్చని స్పష్టం చేసారు. ప్రభుత్వం అంటే ఉద్యోగులదని..అంత దూరం పోవాల్సిన అసరం లేకుండా కూడా పరిష్కారం చేయొచ్చన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండంటూ సీఎం సూచించారు. మంత్రుల కమిటీ తనతో టచ్లోనే ఉందని..తన ఆమోదంతోనే వీటన్నింటినీ కూడా మీకు చెప్పడం జరిగిందని వెల్లడించారు.

ఒక్కటిగా ముందుకు సాగుదాం
ఐ.ఆర్. ఇచ్చిన 30 నెలల కాలానికి గానూ, 9 నెలల ఐ.ఆర్ను. సర్దుబాటు నుంచి మినహాయింపు వల్ల రూ.5400కోట్లు భారం పడుతోందని వివరించారు. హెచ్.ఆర్.ఏ రూపంలో అదనంగామరో రూ.325 కోట్లు భారం పడుతోందన్నారు. అదనంగా భారం పడేది కాకుండా రికరింగ్ వ్యయం రూపేణా హెచ్.ఆర్.ఏ వల్ల రూ.800 కోట్లు, అడిషనల్క్వాంటమ్పెన్షన్, సీసీఏ రూపంలో మొత్తంగా రూ.1330 కోట్లు భారం పడుతోందిని సీఎం లెక్కలు చెప్పారు. మొత్తంగా రూ.11,500 కోట్లు రికరింగ్గా భారం పడుతోంది. ఆర్థికంగా పడే భారం ఇదని చెబుతూ..మీకు తెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ వివరాలు చెప్తున్నానని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా... మీరు ఈ ప్రతిపాదనలకు అంగీకరించినందుకు ధన్యవాదాలు. మనం ఒక్కటిగా కలిసి ముందుకు సాగుదామని సీఎం పిలుపునిచ్చారు.

పెన్షన్ మరింత పెరిగేలా చూస్తాను
ఈ పరిస్థితులు ఈ మాదిరిగా ఉండకపోయి ఉంటే... మీ అందర్నీ మరింత సంతోషపెట్టేవాడినని సీఎం చెప్పారు. దురదృష్టవశాత్తూ అలాంటి పరిస్థితులు లేవు. రాష్ట్ర ఆదాయాలు బాగా పడిపోయాయని వివరించారు. మీరు లేకపోతే నేను లేను. పారదర్శకంగా, అవినీతి లేకుండా బటన్ నొక్కి ప్రజలకు ఇవ్వగలుగుతున్నానని... ఇది మీ వల్లే సాధ్యపడుతోందని పేర్కొన్నారు. భావోద్వేగాలకు పెద్దగా తావు ఇవ్వకండి. ఏదైనా సమస్య ఉంటే.. మీరు చెప్పుకోండని సూచించారు. రాబోయే రోజుల్లో సీపీఎస్మీద గట్టిగా పనిచేస్తున్నామని..అన్ని వివరాలూ తీసుకుని గట్టిగా పనిచేస్తున్నామని చెప్పారు. వివరాలు ఖరారైన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులతో వాటిని పంచుకుంటానన్నారు. ఇవాళ మీరు కొత్తపద్దతిలోతీసుకుంటున్న పెన్షన్ మంచిగా పెరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

ఉద్యోగులకు ఎవరూ చేయని విధంగా
ఉద్యోగులకు ఎవ్వరూ చేయని విధంగా జగన్ చేశాడు అనే పరిస్థితిలోకి వెళ్లేలా.. రిటైర్ అయిన తర్వాత మీకు మంచి జరిగేలా ఆ దిశగా అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. భిన్నంగా ఎలా చేయాలో కూడా గట్టిగా ఆలోచనలు చేస్తున్నామని చెప్పారు. 30వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇస్తున్నామని..సబ్జెక్టుల వారీగా టీచర్లను తీసుకువస్తున్నామన్నారు. 24 నెలల జీతం రూపేణా మరోచోట మంచి జరుగుతుందనే ఉద్దేశంతోమీరు అడగకపోయినా మేం చేశామని చెప్పారు. ప్రభుత్వం ఎప్పుడూ మీతో ఉంటుంది. ఏ సమస్యపైనైనా చర్చకు సిద్ధం అని ప్రకటించారు. ఉద్యోగులు చెప్పేవి వినడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని సీఎం జగన్ స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications