వైద్య సిబ్బందికి తగిన రక్షణ ఇవ్వాలి: పవన్ కళ్యాణ్ ప్రశంసలు
అమరావతి: దేశ వ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ఎంతో సాహసోపేతంగా పనిచేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కరోనా రోగులకు సేవలందిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. వైద్యులను భగవంతుడితో సమానంగా చూసే సంస్కృతి మనదేశానిదని చెప్పారు.
కరోనా ఉధృతి ఉన్న సమయంలో ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటేనే మెరుగైన సమాజం స్థాపితమవుతుందని, ఆ దిశగా ఆరోగ్యవంతమైన సమాజం తీసుకువచ్చేందుకు వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారని అన్నారు. మానవతామూర్తులైన ఎందరో వైద్యులు తమ వృత్తి ధర్మంలో పేదలకు ఎనలేని సేవలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అభినందించారు.

తమకీ, తమ కుటుంబానికీ వైరస్ ముప్పు ఉంటుందని తెలిసీ రోగులకు సేవలు చేస్తున్నవారిని ఎప్పటికీ మర్చిపోకూడదని అన్నారు. విధి నిర్వహణలో ఉన్న వైద్యులకు, పారా మెడికల్ సిబ్బందికి ప్రభుత్వం తగిన రక్షణ, భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
అలాగే కొవిడ్-19 విధుల్లో ఉన్న వారందరికీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించిన విధంగా పీపీఈలు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. రోగుల సేవలో ఉన్న నర్సులు, ప్రసూతి ఆయాల ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చడంతోపాటు ఉద్యోగ భద్రతకు తగిన చట్టాలు తీసుకురావాలని పవన్ కళ్యాణ్ కోరారు.
కాగా, ఏపీలో మంగళవారం ఉదయం 9గంటల వరకు ఒక్క కరోనా కేసు మాత్రమే నమోదైంది. గుంటూరు జిల్లాలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 304కు పెరిగింది. మరోవైపు కర్నూలు జిల్లా చెందిన వ్యక్తి(45) కరోనాతో బాధపడుతూ మంగళవారం మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య రాష్ట్రంలో నాలుగుకు చేరింది.












Click it and Unblock the Notifications