అదిరిపోయే శుభవార్త.. ఏపీలో వారికి టచ్ స్క్రీన్ మొబైల్స్ ఫ్రీ!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అందిస్తున్న పథకాలు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాయని ఏపీ మంత్రులు చెబుతున్నారు. తాజాగా ఏపీ సర్కార్ మూగ, చెవిటి వాళ్ళయిన బధిరుల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకుంది.
వారికి ఉచితంగా మొబైల్ ఫోన్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూగ, చెవిటి వారైన బధిరులకు ఒక కీలక సహాయం అందించడానికి రెడీ అయింది ఏపీ సర్కార్. రాష్ట్రవ్యాప్తంగా వీరికి ఉచితంగా టచ్ స్క్రీన్ మొబైల్ ఫోన్లను అందజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేక ప్రతిభావంతుల విభాగం అధికారి ఏడిపి కామరాజు ప్రకటన విడుదల చేశారు. వీరి మెరుగైన జీవన ప్రమాణాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.

అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి ఇలా
రాష్ట్రవ్యాప్తంగా 18 సంవత్సరాల వయసు ఉండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన , సైన్ లాంగ్వేజ్ లో ప్రావీణ్యం కలిగి ఉన్న, కనీసం 40 శాతానికి పైగా వైకల్యం ఉన్న బధిరులకు టచ్ స్క్రీన్ మొబైల్ ఫోన్లను ఇవ్వనున్నారు. అంతేకాదు వారి కుటుంబ వార్షిక ఆదాయం మూడు లక్షల లోపుగా ఉండాలని నిర్ణయించారు. ఇక అటువంటివారు www.apdascac.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని పేర్కొన్నారు.
దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు ఇవే
ఇక ఆన్లైన్లో అప్లై చేసుకునే వారు వారికి సంబంధించిన ఆధార్ కార్డు, పదవ తరగతి, ఇంటర్ మార్కుల జాబితా, వైకల్య ధ్రువీకరణ పత్రం, సైన్ లాంగ్వేజ్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికెట్, తెల్ల రేషన్ కార్డు కాపీ, పాస్పోర్ట్ సైజు ఫోటోతో వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని అర్హత కలిగిన బధిరులు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు .












Click it and Unblock the Notifications