RR Venkatapuram Gas Leakage గ్రామంలో విష వాయువు బాధిత కుటుంబాల దుఃఖం...హృదయ విదారకం...!
ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి రసాయన విష వాయువు లీక్ అవడంతో విశాఖ నగరం ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయింది. నగరంలోని ఆర్.ఆర్.వెంకటాపురం పరిధిలో ఉన్న ఈ పరిశ్రమ నుంచి 3 కి.మీ మేర ఈ విష వాయువు వ్యాపించటంతో వేల సంఖ్యలో ప్రజలు అస్వస్థత కు గురయ్యారు.. తెల్లవారుజామున 3గంటల సమయంలో గ్యాస్ లీక్ అవడంతో నిద్రమత్తులో ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితిలో వారంతా అపస్మారక స్థితికి చేరుకున్నారు .
ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకేజ్ .. ఆర్ .ఆర్ వెంకటాపురంలో తీవ్ర ప్రభావం
ఇక ఆర్ . ఆర్ వెంకటాపురం వాసులకు ఏం జరుగుతుందో అర్ధం అయ్యే లోపే అందరూ దాదాపు స్పృహ తప్పారు. ఇప్పటికి ఐదుగురు మృత్యు వాత పడ్డారు. చాలా మంది పరిస్థితి సీరియస్ గా ఉంది . అపస్మారక స్థితికి చేరుకుని రోడ్లపైనే పడిపోయారు. ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తే క్రమంలో ఇదే గ్రామానికి చెందిన గంగరాజు అనే వ్యక్తి బావిలో పడి మృతి చెందాడు. మరికొందరు బయటకు రాలేక ఇళ్లలోనే ఉండిపోయారు. పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించారు. కానీ అప్పటికే చాలా మంది ఈ విష వాయువు ప్రభావానికి లోనయ్యారు .
రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్,ఎస్డీఆర్ఎఫ్ బృందాలు... తలుపులు పగలగొట్టి మరీ బాధితుల తరలింపు
ఇక ఎన్డీఆర్ఎఫ్,ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఆర్.ఆర్.వెంకటాపురం గ్రామానికి చేరుకుని సహాయక చర్యలకు రంగంలోకి దిగాయి. అపస్మారక స్థితికి చేరుకున్న వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇక కుటుంబాలకు కుటుంబాలే తమ వారి జాడ కోసం విలవిలలాడుతున్నారు. ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా అర్ధం కాని స్థితికి చేరుకున్నారు. ఇక రసాయన వాయువు పీల్చి ఎంత మంది ఇళ్లలో ఉండిపోయారో కూడా లెక్క తెలియడంలేదు. దీంతో వారు అపస్మారక స్థితికి చేరుకునే ప్రమాదం ఉన్న నేపధ్యంలో తలుపులు పగులగొట్టి ఇళ్లలో ఉన్న వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు . సాయంత్రానికి బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు.
ఇంకా కొనసాగుతున్న సహాయక చర్యలు ...2000 మంది వరకు స్పృహతప్పినట్టు అంచనా
ఎల్జీ పాలిమర్స్ లోని గ్యాస్ ఉన్న ట్యాంక్ పేలిపోవడంతో గ్యాస్ ఒక్కసారిగా బయటకు లీక్ అయ్యింది. లీకైన గ్యాస్ ఒక్కసారిగా చుట్టుపక్కల గ్రామాల్లోకి వ్యాపించింది. ఇక ఆర్ . ఆర్ వెంకటాపురం వాసులే ఎక్కువగా దీని బారిన పడ్డారు . ఈ గ్యాస్ కారణంగా ఇప్పటికే 2000 మంది వరకు స్పృహతప్పి పడిపోయినట్టు సమాచారం. ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 5 వేల మంది ఉన్న ఈ గ్రామంలో దాదాపు అందరూ విషవాయువు ప్రభావానికి గురయ్యారని భావిస్తున్నారు అధికారులు .
Recommended Video
ఎవరు ఎక్కడ ఉన్నారో తెలీని స్థితి.. తమవారి క్షేమం కోసం రోదిస్తున్న కుటుంబాలు
ఇప్పటికీ గ్యాస్ ను కంట్రోల్ చేసే పరిస్థితి లేదు . దాదాపుగా 50వేలమందిపై ఈ గ్యాస్ ప్రభావం ఉండి ఉంటుందని ఒక అంచనా. పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని, రెస్క్యూ టీమ్ గ్యాస్ ను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. ఏ వాహనం అందుబాటులో ఉంటె ఆ వాహనంలో ప్రజలను తరలిస్తున్నారు. కానీ తమ వారి కోసం , తమ పరిస్థితి తలచుకుని రోదిస్తున్న వారి ఆవేదన మిన్ను ముడుతుంది. బిడ్డల కోసం తల్లడిల్లుతున్న తల్లులు, తల్లి దండ్రుల కోసం ఏడుస్తున్న పిల్లలు , వృద్ధులు ఇలా ఒకరేమిటి . ఎవర్ని కదిలించినా తీవ్ర వేదనే .. చెప్పలేని రోదనే కనిపిస్తుంది.