గుడివాడ కేంద్రంగా - చంద్రబాబు వర్సెస్ కొడాలి నాని : ఇద్దరికీ ప్రతిష్ఠాత్మకం - ఏం జరుగుతోంది..!!
గుడివాడ రాజకీయం హీటెక్కుతోంది. మాజీ మంత్రి కొడాలి నాని టార్గెట్ గా టీడీపీ అధినేత చంద్రబాబు గుడివాడలో పార్టీ జిల్లా మహానాడుకు నిర్ణయించారు. ఇదే సమయంలో వైసీపీ రాష్ట్ర ప్లీనరీకి ముందు గుడివాడ ప్లీనరీకి కొడాలి నాని సిద్దమయ్యారు. కొద్ది రోజులుగా ఈ రెండు పార్టీల నేతలు హోరా హోరీగా తమ సభల నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. టీడీపీ జిల్లా మహానాడును గుడివాడలో నిర్వహించాలని నిర్ణయించటం వెనుక ఆ పార్టీ అధినేత వ్యూహం స్పష్టం అవుతోంది.
చంద్రబాబు వర్సెస్ కొడాలి నాని
కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబు - లోకేష్ టార్గెట్ గా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసారు. వైసీపీలో ప్రధానంగా కొడాలి నాని ఇప్పుడు టీడీపీకి టార్గెట్ అయ్యారు. దీంతో..గుడివాడలో పార్టీని బలోపేతం చేసుకోవటం.. అదే సమయంలో గుడివాడ కేంద్రంగానే కొడాలి నానికి సమాధానం చెప్పే లక్ష్యంతోనే టీడీపీ అక్కడ మహానాడు నిర్వహణకు నిర్ణయించింది. అయితే, స్థానికంగా టీడీపీ నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు..విభేదాలు పార్టీకి సమస్యగా మారుతున్నాయి. ఇప్పటికే ఫ్లెక్సీల వ్యవహారం నుంచి సభా నిర్వహణ వరకు నేతల మధ్య సమన్వయం కుదరటం లేదు. పార్టీ అధినాయకత్వం దీని పైన సీరియస్ అయింది. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గంలో అందరూ కలిసి పని చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
రెండు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా
ఇక, ఈ రోజు నియోజకవర్గ వైసీపీ ప్లీనరీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని నేతృత్వంలో ప్లీనరీ జరగనుంది. ఎంపీ బాలశౌరితో పాటుగా జిల్లా పార్టీ కో ఆర్డినేటర్ మర్రి రాజశేఖర్.. మాజీ మంత్రి పేర్ని నాని హాజరు కానున్నారు. రేపు (బుధవారం) టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గానికి రానున్నారు. పార్టీ ప్లీనరీ నిర్వహణ సమయంలో కొడాలి నాని టార్గెట్ గా చంద్రబాబు ప్రసంగం కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి పార్టీ నేతలకు ఏర్పాట్ల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు అందాయి.
గుడివాడ కేంద్రంగా రాజకీయ వేడి
తాజాగా.. గుడివాడ పరిధిలోని అంగలూరు, బొమ్మలూరు గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహానికి రంగులు, ఫ్లెక్సీల విషయంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. మినీ మహానాడు జరిగే అంగులూరుకు కిలోమీటరు దూరంలోనే ఈ ఘటన జరగడంతో టీడీపీ జిల్లా నేతలు అక్కడకు చేరుకున్నారు. రెండు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కార్యక్రమాలు.. ఇప్పటికే చోటు చేసుకున్న ఘటనలతో ఈ రోజు.. రేపు గుడివాడ కేంద్రంగా రెండు పార్టీల నేతల మధ్య ఎటువంటి పొలిటికల్ వార్ చోటు చేసుకుటుందనే ఆసక్తి నెలకొని ఉంది. వైసీపీ ప్లీనరీలో కొడాలి నాని చేయనున్న ప్రసంగం పైన నియోజకవర్గంలో ఉత్కంఠ కనిపిస్తోంది.