బీహార్ ని తలపించేలా ఏపీలో గన్ కల్చర్; రావణకాష్టంలో మహిళలు బలి: భగ్గుమన్న టీడీపీ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై నేరాలు అడ్డూ అదుపు లేకుండా కొనసాగుతున్నాయి. అత్యాచారాలు, హత్యలు మాత్రమే కాకుండా ప్రేమోన్మాదులు దాడులు ఏపీలో శాంతిభద్రతల పరిస్థితిని ప్రశ్నిస్తున్నాయి. నిత్యం ఏపీలో చోటుచేసుకుంటున్న దారుణ ఘటనలపై తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతుంది. ఏపీలో మహిళలకు రక్షణ లేదని తేల్చి చెబుతోంది. జగన్ పాలనలో అరాచకాలు పెరిగిపోయాయని పదే పదే విమర్శలు గుప్పిస్తోంది.

నెల్లూరు ప్రేమోన్మాది ఘాతుకం
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందని ప్రశ్నిస్తుంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలపై అనేకమార్లు జగన్ సర్కార్ ను టార్గెట్ చేసి విమర్శించినా, ప్రభుత్వానికి, ఏపీ డీజీపీ కి లేఖ రాసినా ఫలితం మాత్రం శూన్యం గా కనిపిస్తుంది. తాజాగా నెల్లూరు జిల్లాలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తుపాకీతో ఓ యువతిని కాల్చి చంపి, అదే తుపాకీతో తాను కూడా కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని కారణంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఇక ఈ ఘటనపై టీడీపీ నాయకులు మండిపడుతున్నారు.

బీహార్ ని తలపించే విధంగా ఏపీలో గన్ కల్చర్ : లోకేష్
దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వైసీపీ ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. బీహార్ ని తలపించే విధంగా ఏపీలో గన్ కల్చర్ రావడం దురదృష్టకరం అంటూ పేర్కొన్నారు లోకేష్. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడటం తీవ్రదిగ్భ్రాంతికి గురిచేసిందని లోకేష్ వ్యాఖ్యానించారు. పెళ్లికి అంగీకరించలేదని బంగారు భవిష్యత్తు ఉన్న యువతిపై సురేష్ రెడ్డి కాల్పులు జరిపి చంపడం దారుణం అని పేర్కొన్న లోకేష్ ఆడబిడ్డలపై పెరిగిపోతున్న ఈ అఘాయిత్యాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.

రావణ కాష్టంలో మహిళలు బలి : వంగలపూడి అనిత
ఇక లోకేష్ మాత్రమే కాదు రాష్ట్రంలో జరుగుతున్న దారుణ ఘటనలపై టిడిపి మహిళా నాయకురాలు వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఈ రావణకాష్టంలో మరో ఇద్దరు స్త్రీలు బలి అంటూ పేర్కొన్న వంగలపూడి అనిత రాప్తాడు నియోజకవర్గం, కనగానపల్లి మండలం కొండపల్లి గ్రామంలోని మా పార్టీ నాయకురాలు స్వర్ణక్క కుమార్తె మమతను బహిర్భూమికి వెళ్ళిన సమయంలో దారుణంగా రాళ్ళతో దుండగులు కొట్టి చంపారని వ్యాఖ్యానించారు . నెల్లూరు, పొదలకూరు మండలం తాటిపత్రిలో రివాల్వర్ తో కావ్యను సురేష్ రెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చంపారని పేర్కొన్నారు.

మహిళల రక్షణ గురించి భారీ సినిమా డైలాగులు.. జగన్ రెడ్డి పై అనిత ఫైర్
రాష్ట్రంలో రోజు రోజుకూ యువతులపై దాడులు పెరుగుతున్నాయే గానీ తగ్గడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళల రక్షణ గురించి భారీ సినిమా డైలాగులు కొట్టిన జగన్ రెడ్డి నేడు సీఎం అయ్యాక కనీసం నోరు మెదపక పోగా అత్యాచారాలు, హత్యల గురించి అవహేళనగా మాట్లాడుతున్నాడు అంటూ తీవ్ర స్థాయిలో వంగలపూడి అనిత విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications