గుంటూరు టీడీపీ నాయకుడి ఇంటివద్ద కడప వైసీపీ నాయకుడి రెక్కీ?
రవీంద్ర దగ్గర ఉన్న ఐడెంటిటీ కార్డులో నియోజకవర్గ వైఎస్సార్సీపీ బీసీ సెల్ ఇన్ ఛార్జ్ అనే పేరు ఉంది
కడప జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుంటూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంటి దగ్గర రెక్కీ చేయడం కలకలం రేపింది. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరుకు చెందిన టీడీపీ నాయకుడు బండారు కోటేశ్వరరావు ఇంటి సమీపానికి.. కడప జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లెకి చెందిన ఎన్ రవీంద్ర అనే వ్యక్తి వెళ్లారు. గ్రామంలో ముఖ్య నాయకుడి ఫోన్ నెంబరు కావాలని అడగ్గా.. వెంటనే కోటేశ్వరరావు 'నువ్వెవరు.. మా ఇంటికి ఎందుకు వచ్చావు. ఏం పని మీద వచ్చావు.. ఎక్కడి నుంచి వచ్చావ్' అని ప్రశ్నించారు.
రవీంద్ర దగ్గర ఉన్న ఐడెంటిటీ కార్డులో నియోజకవర్గ వైఎస్సార్సీపీ బీసీ సెల్ ఇన్ ఛార్జ్ అనే పేరు ఉంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తనకు తెలుసంటూ పొంతన లేని సమాధానం చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు అతణ్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులతోనూ ఇలాగే పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉండే వైసీపీ నాయకులు కొందరు పోలీస్ స్టేషన్కు వెళ్లి గుంటూరులోని వైసీపీ కార్యాలయంలో జరిగే సమావేశానికి వచ్చాడని చెప్పారు.

రవీంద్రకు మతిస్థిమితం లేదని.. వదిలి పెట్టాలని కోరారు. పోలీసులు అతడిని ప్రశ్నించిన తర్వాత వదిలేశారు. టీడీపీ నాయకుడి ఇంటి దగ్గరకు వైఎస్సార్సీపీ నాయకుడు రావడం అనుమానాస్పదంగా ఉందని టీడీపీ నాయకులు అంటున్నారు. కడప జిల్లాకు చెందిన వ్యక్తి గుంటూరు జిల్లాలో ఉండే నాయకుడి గురించి ఆరా తీయడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. రవీంద్ర దగ్గర సేకరించిన వివరాలను తాడికొండ పోలీసులు కడప పోలీసులకు పంపించారు. చెప్పివన్నీ సరైనవేనని తేలితే ఎటువంటి చర్యలు తీసుకోబోమని, ఇక్కడ చెప్పినదానికి, సేకరించిన దానికి తేడా ఉంటే చర్యలు తప్పవని చెప్పి రవీంద్రను పోలీసులు హెచ్చరించి పంపారు.












Click it and Unblock the Notifications