కూటమిలో విశాఖ మేయర్ సీటు వారికేనా- అక్కడే అసలు ట్విస్ట్..!!
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. స్థానిక ఎన్నికల కోసం పార్టీలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. ఈ నెలాఖరు లోగా షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. దీంతో.. కూటమి పార్టీలు సీట్ల సర్దుబాటు పైన జిల్లా స్థాయిలో చర్చలు మొదలు పెట్టాయి. కాగా.. ఈ సారి స్థానిక ఎన్నికల్లో విజయవాడ, విశాఖ సీటు కోసం మూడు పార్టీల నుంచి పోటీ నెలకొంది. విశాఖలో వార్డుల సంఖ్య పెరిగింది. అయితే.. విశాఖ మేయర్ సీటు పైన నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. అయితే, అక్కడ అసలు ట్విస్ట్ తెర మీదకు వస్తోంది.
స్థానిక ఎన్నికల్లో భాగంగా కూటమి పార్టీల మధ్య సీట్ల వ్యవహారం తేలాల్సి ఉంది. 2024 ఎన్నికల తరహాలో కాకుండా.. తాము బలంగా ఉన్న ప్రాంతాల్లో సీట్లు కేటాయించాలని బీజేపీ, జనసేన నేత లు డిమాండ్ చేస్తున్నారు. అందులో విశాఖ, విజయవాడ సైతం ఉన్నాయి. విజయవాడ సీటు పైన కొంత కాలంగా జనసేన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అటు విశాఖ లోనూ మేయర్ సీటు పైన జనసేన ఆశలు పెట్టుకుంది. అదే సమయంలో బీజేపీ సైతం గతంలో తమకు ఉన్న గుర్తింపు.. అక్కడ ప్రాతినిధ్యం పరిగణలోకి తీసుకొని విశాఖ మేయర్ సీటు కేటాయించాలని కోరుతోంది. కాగా.. తాజాగా నగరంలో వార్డుల సంఖ్య 120కి పెరిగింది. వార్డుల సరిహద్దులను అధికారికంగా ఖరారు చేశారు. గతం కంటే వార్డులు పెరగటంతో.. కూటమిలో ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది.

కూటమి నేతల సమావేశంలో తుది నిర్ణయం
విశాఖ కేంద్రంగా పార్టీల బలాలు.. సామాజిక సమీకరణలతో ఇక్కడ కూటమిలో ఏ పార్టీకి మేయర్ సీటు దక్కుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. అయితే.. మేయర్ సీటు టీడీపీ వదులుకోదని పార్టీ నేతలు చెబుతున్నారు. జనసేనకు డిప్యూటీ మేయర్ గా అవకాశం ఉంటుందనేది ఆ నేతల అంచనాగా ఉంది. అదే సమయంలో బీజేపీ సైతం పట్టు బిగిస్తోంది. మేయర్ కు ప్రత్యక్ష ఎన్నిక విధానంలో ఎన్నిక జరగనుండటంతో... ఇక్కడ అభ్యర్ధి విషయంలో ఆచి తూచి నిర్ణయం ఖరారు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కాగా.. ఎన్నికలకు సిద్దం అవుతున్న తరుణంలో నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం మంచి నీటి సమస్య సవాల్ గా మారుతోంది. దీంతో పాటుగా పార్టీల మధ్య సమన్వయం కీలకం అవుతోంది. ఈ పరిస్థితుల్లో విశాఖ కేంద్రంగా కూటమి నేతలు తీసుకునే నిర్ణయాల పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది.













Click it and Unblock the Notifications
