పవన్ కుల సమీకరణాలకు హరిరామ జోగయ్య మద్దతు - 2024 ఎన్నికల్లో జగన్ పర్యవసానం చూస్తారు..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా రాజమండ్రి వేదికగా కొత్త సమీకరణాలకు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు రెండు వర్గాలకే ఆధికారంలో ఉంటూ వచ్చాయని..ఈ పరిస్థితి పైన అందరూ ఆలోచించాలని సూచించారు. ఇందు కోసం ఉభయ గోదావరి జిల్లాల నుంచి మార్పు మొదలు కావాలన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పైన కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య స్పందించారు. పవన్ కళ్యాణ్ నిర్వహించిన సభ ఆయన రాజకీయ ఎదుగుదలకు నాంది అని పేర్కొన్నారు.
వివిధ కులాల కలయికతో రాజ్యాధికారం చేపట్టి ఇందుకు కాపులు, తెలగలు, బలిజలు, ఒంటరి.. మిగిలిన కులాలను కలుపుకొని పోవాలనే వ్యాఖ్యలను సమర్ధిస్తున్నామన్నారు. దానికి పవన్ సారథ్యం వహించడం స్వాగతిస్తున్నామని చెప్పారు. జనసేన రాజ్యాధికారం దక్కించుకుంటే పరిపాలన ఈ నాటి ప్రభుత్వ పాలనలా కాకుండా ప్రజాస్వామ్యయుతంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి సాధించే విధంగా ఉంటుందన్నారు. పవన్ ప్రతిపాదనలు ఆహ్వానించదగ్గ విధంగా ఉన్నాయని, జనసేనాని ప్రతిపాదనలను కాపు సంక్షేమ సేన మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తుందన్నారు.

కాపు మంత్రులు పవన్ కళ్యాణ్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం వెనక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. పవన్ని అవమానపరచడం అంటే... కాపు సమాజాన్ని అవమానపరచడేమన్నారు. ఇటువంటి చర్యలకు పర్యవసానం 2024 ఎన్నికలలో ముఖ్యమంత్రి చవి చూడవలసి వస్తుందని హరిరామ జోగయ్య హెచ్చరించారు. చాలా కాలంగా కాపు రిజర్వేషన్ల గురించి హరిరామ జోగయ్య డిమాండ్ చేస్తున్న నేతల్లో కీలకంగా ఉన్నారు. ఆయనకు పవన్ తో సత్సంబంధాలు ఉన్నాయి.
ఇప్పుడు పవన్ చేస్తున్న తాజా సమీకరణాల ప్రతిపాదన పైన జోగయ్య స్పందించటంతో..ఈ కులా సమీకరణాలు హాట్ డిబేట్ గా మారే అవకాశం ఉంది. అయితే, పవన్ ఉద్దేశ పూర్వకంగానే ఉభయ గోదావరి జిల్లాల నుంచే ఈ మార్పు సాధ్యం కావాలని చెప్పటం వెనుక పెద్ద వ్యూహమే కనిపిస్తోంది. ఆ రెండు జిల్లాల్లో కాపు వర్గం అత్యధికంగా ఉండటం..ఆ రెండు జిల్లాల్లోని గెలిచే సీట్లే ఏపీలో అధికారం దక్కించుకోవటంలో కీలక పాత్ర పోషించటం సాధారణంగే జరగుతున్న విధానం.

అయితే, పవన్ నేరుగా కాపు-బీసీ-ఎస్సీ వర్గాల ఐక్యత తోనే రాజ్యాధికారం సాధ్యమని స్పష్టం చేసారు. అయితే, రాజకీయంగా ఈ లక్ష్య సాధనలో ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తారనేది మాత్రం ఆసక్తి కరంగా మారుతోంది. ఏపీలో రాజకీయాలను..ఎన్నికల ఫలితాలను సామాజిక సమీకరణాలే నిర్ధేశిస్తాయి. దీంతో..రానున్న రోజుల్లో ఏపీలో రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications