పిల్లనిచ్చిన మామనే మోసం చేశాడు: బాబుపై హరీష్
హైదరాబాద్: తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుని ఆ పార్టీ తెలంగాణ నేతలే నిలదీయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు సూచించారు. ఢిల్లీలో జాతీయనేతలను కలిస్తున్న చంద్రబాబు వారిని ఏం కోరుతున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో చీకట్లో చిదంబరాన్ని కలిసిన చంద్రబాబు ఇప్పుడు జాతీయ పార్టీల నేతలను ఒంటరిగా కలుస్తున్నారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మూడు కళ్ల సిద్ధాంతాన్ని పాటిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేతిలో మోసపోని పార్టీ లేదని ఆయన అన్నారు. చంద్రబాబు చేయని మోసం లేదని ఆయన అన్నారు. బిజెపి, తెరాస, కాంగ్రెసు, కమ్యూనిస్టు పార్టీలనే కాకుండా పిల్లనిచ్చిన మామను కూడా మోసం చేశాడని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణకు అనుకూలమని గతంలో ప్రణబ్ కమిటీకి చంద్రబాబు లేఖ ఇచ్చారని, బిల్లు పెడితే మద్దతిస్తామని కూడా చెప్పారని, ఇప్పుడు రాష్ట్రపతి వద్దకు వెళ్లి ఏం చెప్తారని ఆయన అన్నారు.
ఇదంతా చూస్తుంటే చంద్రబాబు మానసిక స్థితిపై అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. తెలంగాణను అడ్డుకుంటే బిజెపికి మద్దతు ఇస్తానని చంద్రబాబు చెప్పినట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయని ఆయన అన్నారు. అసలు తెలంగాణపై తన వైఖరి ఏమిటో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ మూడు విధానాల పార్టీగా మారిపోయిందని, రెండు కళ్ల సిద్దాంతం పోయి మూడు కళ్ల సిద్ధాంతానికి వచ్చిందని ఆయన అన్నారు. చంద్రబాబు రహస్య ఎజెండా తెలంగాణను అడ్డుకోవడమేనని ఆయన అన్నారు.
చంద్రబాబును తెలుగుదేశం తెలంగాణ నాయకులు నిలదీయాలని ఆయన డిమాండే చేశారు. నిజమైన తెలంగాణవాదులైతే చంద్రబాబును ప్రశ్నించాలని ఆయన అన్నారు. చంద్రబాబుతో తెలంగాణకు మద్దతు ఇప్పించాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కుట్రలను తెలంగాణ నేతలు తిప్పికొట్టాలని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఢిల్లీలో దీక్షకు దిగుతున్న ముఖ్యమంత్రి కిరణ్ ఎదుట తెలంగాణ కాంగ్రెస్ నేతలు దీక్ష చేపట్టాలని సూచించారు. కిరణ్ రెడ్డికి ఎదురుగానే డిప్యూటీ సిఎం రాజనర్సింహతో పాటు తెలంగాణ కాంగ్రెసు నేతలు దీక్షకు దిగాలని ఆయన అన్నారు. సీమాంధ్రకు చెందిన ముఠాకు కిరణ్ నాయకుడని తీవ్రంగా విమర్శించారు. అందరూ కలిసి ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణను ఆపలేరని ఆయన స్పష్టం చేశారు.
సీమాంధ్ర నేతలు కుట్ర చేస్తున్నారు
తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు కుట్రలు చేస్తున్నారని తెలంగాణ జెఎసి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తీవ్రంగా విమర్శించారు. మంగళవారం హైదరాబాద్లోని బీజేపి కార్యాలయంలో తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర నేతలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
బిజెపి అగ్రనేత సుష్మాస్వరాజ్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను సీమాంధ్ర నేతలు వక్రీకరించారని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణకు అనుకూలమన్న బీజేపి మాట తప్పదని అభిప్రాయపడ్డారు. మన కల నెరవేరుతున్న తరుణంలో అప్రమత్తంగా ఉండాలని, సీమాంధ్ర నేతల మాటలు పట్టించుకోవద్దని తెలంగాణ ప్రజలకు కోదండరాం సూచించారు. తెలంగాణకు బిజెపి మద్దతు ఇస్తుందనే విశ్వాసం ఉందని ఆయన చెప్పారు. ఉద్యమ శక్తుల మధ్య ఐక్యత ఉందని ఆయన చెప్పారు.
ఆఖరి మెట్టు అధిగమించి పార్లమెంటులో బిల్లును ఆమోదింపజేసుకుంటామని ఆయన అన్నారు. సమైక్యం పేరు మీద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఢిల్లీలో ఘర్షణ వాతావరణం నెలకొందని ఆయన అన్నారు.