ఎన్టీఆర్ కోసం సీఎం జగన్ భారీ స్కెచ్ : ప్రధానితో కలిసి - టార్గెట్ చంద్రబాబు..!!
మఖ్యమంత్రి జగన్ కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కొత్త స్కెచ్ లు సిద్దం చేస్తున్నారు. టీడీపీ లక్ష్యంగా..ఆ పార్టీ అధినేత చంద్రబాబును ఆత్మరక్షణలోకి నెట్టే విధంగా కొత్త అడుగులు వేస్తున్నారు. ఇందుకు కేంద్రంలోని పెద్దలు సైతం మద్దతివ్వటం అసలైన ట్విస్ట్. కొద్ది రోజులుగా ఏపీలో హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు వ్యవహారం రాజకీయ రగడకు కారణమైంది. అయితే, ఈ పేరు మార్పు వ్యవహారంలో..వైసీపీ నేతలు ప్రధానంగా చంద్రబాబు - ఎన్టీఆర్ వెన్నుపోటు అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేసారు. తొలి రోజన పేరు మార్పు వ్యవహారం పైన సీరియస్ గా రియాక్ట్ అయిన టీడీపీ తాము అధికారంలోకి వస్తే తిరిగి ఎన్టీఆర్ పేరు మారుస్తామని చెప్పి సైలెంట్ అయిపోయింది.

సీఎం జగన్ ట్రాప్ లో టీడీపీ
మంత్రులు మాత్రం నాటి వైశ్రాయ్ ఎపిసోడ్ లతో మరిన్ని రోజులు ఈ వ్యవహారం కొనసాగించారు. ఫలితంగా సీఎం జగన్ ట్రాప్ లో టీడీపీ పడిందనే అభిప్రాయం స్పష్టంగా కనిపించింది. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు ప్రకటన ద్వారా ఎన్టీఆర్ మద్దతు దారులు..ఒక వర్గానికి చెందిన ప్రముఖులు జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రధానంగా ఆ నిర్ణయంతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది .14 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఏ జిల్లాకు ఎన్టీఆర్ పేరు ప్రకటన చేయకపోవటం పైన సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. ఇక, ఇప్పుడు ముఖ్యమంత్రి కొత్త స్కెచ్ సిద్దం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలంటూ టీడీపీ అధినేత మొదలు పార్టీ నేతలు పార్టీ మహానాడు - ఆయన వర్దంతి నాడు డిమాండ్ చేయటం.. మహానాడు లో తీర్మానం చేయటం సాధరణంగా మారిపోయింది.

సీఎం జగన్ కొత్త స్కెచ్ తో ముందు
ఇప్పుడు ఎన్టీఆర్ పేరు మార్పు వ్యవహార వివాదంలో నందమూరి కుటుంబానికి సన్నిహితుడుగా పేరున్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కీలక అంశాన్ని బయట పెట్టారు. వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో తాను..సీ నారాయణ రెడ్డి కలిసి ఎన్టీఆర్ కు భారత రత్న ప్రకటించాలని కోరగా, తమకు అభ్యంతరం లేదని..చంద్రబాబు సుముఖంగా లేరని చెప్పారనే విషయాన్ని బయట పెట్టారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇస్తే ఆ పురస్కారం ఆయన భార్యగా లక్ష్మీ పార్వతి స్వీకరించాల్సి ఉంటుందని, అదే ప్రధాన కారణమని విశ్లేషించారు. దీంతో..ఇప్పుడు లక్ష్మీ పార్వతి వైసీపీలో ఉన్నారు. ఇదే సమయంలో వైసీపీ నుంచి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా నందమూరి తారక రామారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని కేంద్రాన్ని కోరేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ కు భారత రత్న కోరుతారంటూ
దీనికి సంబంధించి కేబినెట్ సమావేశం..అసెంబ్లీలోనూ తీర్మానం చేసి కేంద్రానికి నివేదించే విధంగా కార్యచరణ సిద్దం చేస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఈ తీర్మానం ప్రధాని మోదీకి అందించి.. భారతరత్న ఇవ్వాలని కోరుతారని పార్టీలో చర్చ వినిపిస్తోంది. ఎన్టీఆర్ కు భారతరత్న విషయంలో కేంద్రం నుంచి సానుకూల స్పందన ఉంటుందని అంచనా వేస్తున్నారు.దీని ద్వారా.. చంద్రబాబును పూర్తిగా ఆత్మరక్షణలో పడేయటంతో పాటుగా.. తాను ఒక వర్గానికి వ్యతిరేకమనే ప్రచారానికి ముగింపు పలకాలనేది సీఎం జగన్ ఆలోచనగా తెలుస్తోంది. అదే సమయంలో ఈ నిర్ణయం తో సొంత పార్టీ మద్దతు దారుల్లో..అదే విధంగా ఇతర వర్గాల్లో ఎటవంటి స్పందన ఉండే అవకాశం ఉందనే కోణంలోనూ ఇన్ఫర్మేషన్ రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా సమాచారం.

చంద్రబాబును ఆత్మరక్షణలోకి నెట్టటమే లక్ష్యంగా
ఎన్టీఆర్ పైన తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ వ్యతిరేకత లేదని, చంద్రబాబును ఆత్మరక్షణలో పడేసే ఈ నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించరనేది పార్టీ సీనియర్ల అభిప్రాయం. ఇక, తన తాత అంటే అమితంగా గౌరవించే జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ నిర్ణయాన్ని స్వాగతించటం ఖాయమని చెబుతున్నారు. అదే విధంగా టీడీపీలో ఎన్టీఆర్ తో కలిసి పని చేసిన వారి సైతం ఈ నిర్ణయాన్ని ఓపెన్ గానే స్వాగతించే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ వచ్చే ఎన్నికల ముందు టీడీపీకి ఇబ్బందికరంగా మారుతాయనే అంచనాలు ఉన్నాయి. దీంతో..ఇప్పుడు ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం సిఫార్సు చేయనుందనే అంశం పైన రాజకీయంగా ఆసక్తికర చర్చ మొదలైంది. మరి..సీఎం జగన్ ఈ విషయంలో చివరకు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.












Click it and Unblock the Notifications