చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంలో వాడీవేడీ వాదనలు-కాసేపట్లో తీర్పు ?
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన అరెస్టు, రిమాండ్ ను సవాల్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ పునఃప్రారంభమైంది. మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ ప్రారంభం కాగా.. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో చంద్రబాబుకు సెక్షన్ 17ఏ ఎట్టి పరిస్ధితుల్లోనూ వర్తించదని ఆయన వాదిస్తున్నారు. ఇందుకు పలు ఉదాహరణలు కూడా ప్రస్తావిస్తున్నారు.

చంద్రబాబు కేసులో సెక్షన్ 17ఏ వర్తించదని, ఎందుకంటే అది పాత కేసులకు వర్తింపజేసే అవకాశం లేదని సీఐడీ తరఫున లాయర్ ముకుల్ రోహత్గీ వాదించారు. సెక్షన్ 17ఏ తీసుకొచ్చింది ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునే వారు ఇబ్బంది పడకూడదని మాత్రమేనన్నారు. ఈ కేసులో ఆరోపణలు అన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించతగినవే అని తెలిపారు. అలాగే ఏసీబీ కోర్టు విచారణ పరిధిపైనా ఆయన వాదించారు. ప్రత్యేక కోర్టుకు ఈ కేసు విచారించే పరిధి ఉందని తెలిపారు. వందల కోట్ల ఆరోపణలు ఉన్న కేసుల్లో ఛార్జిషీట్లు వేసి విచారించి శిక్ష కూడా విధించవచ్చని తెలిపారు. అయితే ఆరోపణలపై అన్ని నిర్ణయాలు తీసుకోగలమా అని న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేదీ ప్రశ్నించారు.
ఈ కేసులో కేసుల నమోదు, విచారణ, ఛార్జిషీట్ దాఖలుపై రోహత్గీ వాదనపై మరో న్యాయమూర్తి అనిరుద్ధ బోస్ కూడా అభ్యంతరం తెలిపారు. ప్రస్తుతం కేవలం సెక్షన్ 17ఏ వర్తిస్తుందా లేదా అన్న దానిపైనే విచారణ జరుగుతోందని గుర్తుచేశారు. అయితే ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్ధలు కూడా విచారణ చేస్తున్న విషయాన్ని ముకుల్ రోహత్గీ ప్రస్తావించారు. కాబట్టి అవినీతి నిరోధక కేసులతో పాటు సాధారణ కేసుల్లోనూ పోలీసులు విచారణ చేస్తున్నారన్న కారణంతో ఎఫ్ఐఆర్ క్వాష్ చేయలేరని రోహత్గీ వాదించారు.
అనంతరం చంద్రబాబు తరఫున సుప్రీం లాయర్ హరీష్ సాల్వే వర్చువల్గా వాదనలు వినిపించారు. చట్టసవరణను ముందునుంచి వర్తింపచేసే అంశంపై వాదనలు వినిపించారు. చట్టసవరణను ముందునుంచి వర్తింపచేసే అంశంపై పలు తీర్పులను సాల్వే ఈ సందర్భంగా ఉదహరించారు. ఇందులో 2019 నాటి 'శాంతి కండక్టర్స్' కేసును ప్రస్తావించిన హరీష్ సాల్వే.. 1964 నాటి రతన్లాల్ కేసును కూడా ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications