అల్పపీడనం దెబ్బకు ఏపీ అతలాకుతలం: తిరుపతిలో భారీ వర్షం: మరో 4 రోజులు
Heavy rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ పలుచోట్ల వర్షాలు కురిశాయి. ప్రత్యేకించి- గుంటూరు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. అటు విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి.
బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు ఈ భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చు. నేడు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు-భారీ వర్షాలు కురుస్తాయి.

అలాగే- అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాల, ఆ సమయంలో బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద నిలబడరాదని సూచించారు.
గురువారం సాయంత్రం 5 గంటల సమయానికి తిరుపతి జిల్లా మల్లంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ 70 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. కాకినాడ జిల్లా ఇంజరం- 58, తిరుపతి జిల్లా కోట- 52.7, ప్రకాశం జిల్లా గొల్లవిడిపి- 52.2, యర్రగొండపాలెం- 49.7, చిత్తూరు జిల్లా దామోదర మహారాజపురం- 49, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈతకోటలో 47 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.












Click it and Unblock the Notifications