తిరుమలలో భక్తుల ఇక్కట్లు
Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల ఏపీలో పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తోన్నాయి. ఉత్తరాంధ్ర మొదలుకుని రాయలసీమ జిల్లాల వరకూ భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రత్యేకించి- రాయలసీమలో అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. ఈ వర్షాల తీవ్రత మరో రెండు రోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనావేసింది.
అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అంచనాలకు మించిన వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రాయలసీమపై దీని ప్రభావం అత్యధికంగా కనిపిస్తోంది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ తెల్లవారు జాము నుంచీ ఏకధాటిగా పడుతున్న వర్షం దెబ్బకు తిరుమల, తిరుపతి తడిచి ముద్దయ్యాయి. రోడ్లపై వర్షపునీరు పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బస్టాండ్ లో వరదనీరు చేరుకుంది. తిరుచానూర్, రేణిగుంట, చంద్రగిరి వైపు వెళ్లే మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి.
వరదనీటితో రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద మోకాలి లోతు వరకు వరదనీరు నిలిచిపోయింది. ఫలితంగా ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు బ్రేక్ పడింది. తిరుమలకు వెళ్లడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. అలిపిరి టోల్ గేట్, కాలినడక మార్గంలో భక్తులు తడిచిపోయారు.
అలిపిరి టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీ నిదానంగా సాగుతోంది. తిరుమలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఏకధాటిగా కురుస్తోన్న వర్షానికి భక్తులు షెడ్లు, షెల్టర్లల్లో తలదాచుకుంటోన్నారు. చాలామంది భక్తులు వసతి గదులకే పరిమితం అయ్యారు. అటు తిరుపతి- తిరుమల ఘాట్ రోడ్ లో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. కొండచరియలు విరిగే ప్రమాదం ఉన్నందున టీటీడీ సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టింది.












Click it and Unblock the Notifications