దంచికొట్టనున్న వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ రెయిన్ అలర్ట్ !!
ఓ వైపు నైరుతి రుతుపవనాల తిరోగమనం.. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలోనికి ప్రవేశించనున్నాయి. వీటి ప్రభావంతో ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి 35-45కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
వర్షాలు ఎక్కడెక్కడంటే..
కాగా వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఏపీలోని పలు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని సమాచారం.

మరోవైపు తెలంగాణ లోని నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతోంది. అలాగే మరి కొన్ని జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి ఉరుములతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.
కాగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాల సమయంలో వాగులు, చెరువులు, కాల్వల దగ్గరికి వెళ్లరాదని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. రహదారులపై నీరు నిల్వ ఉండే పరిస్థితుల్లో ప్రయాణాలు తగ్గించుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో 1070 లేదా 1800-425-0109 నంబర్లకు సంప్రదించాలని తెలిపింది. ప్రభుత్వం ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ లైన్లు, చెట్లు విరిగే అవకాశమున్న ప్రాంతాల్లో నడవకూడదని హెచ్చరికలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications