వరుణుడి బీభత్సం. రాబోయే 3 గంటలు అత్యంత కీలకం!
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఏపీలోని విశాఖపట్నంతో పాటు తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్ తదితర నగరాల్లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఏపీ తీర ప్రాంతం వరకు ఒక ద్రోణి విస్తరించి కొనసాగుతోందని, దీని ప్రభావంతో రాబోయే కొన్ని గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
రాబోయే 3 గంటలు అత్యంత కీలకం: జిల్లాల వారీగా అలర్ట్లు
ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు జిల్లాల వారీగా అలర్ట్ జారీ చేశారు.

- ఆరెంజ్ అలర్ట్: పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు వాతావరణ శాఖ 'ఆరెంజ్ అలర్ట్' ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
- ఎల్లో అలర్ట్: కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలకు 'ఎల్లో అలర్ట్' జారీ చేశారు. ఇక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
- రాయలసీమలో భారీ వర్షాలు: ద్రోణి ప్రభావం వల్ల రాయలసీమ జిల్లాల్లో ఆదివారం బలమైన ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడవచ్చు.
పిడుగుల హెచ్చరిక.. ఇళ్లలోనే ఉండాలని సూచన!
వర్షంతో పాటు పలు ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో పిడుగులు పడే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ముఖ్యంగా మచిలీపట్నం, ఏలూరు, నర్సాపురం, దివిసీమ, గుడివాడ, భీమడోలు పరిసర ప్రాంతాలతో పాటు బాపట్ల, నెల్లూరు, రాయలసీమ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాలలో, విద్యుత్ స్తంభాల చెంత ఉండరాదని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు గట్టిగా హెచ్చరించారు.
విశాఖను ముంచెత్తిన వాన.. రికార్డు స్థాయి వర్షపాతం!
విశాఖపట్నం జిల్లాలో శనివారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత, ఉక్కపోతతో అల్లాడిపోయిన జనాన్ని రాత్రి కురిసిన వర్షం చల్లబరిచింది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు నగరవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రహదారులు చెరువులను తలపించాయి. పూర్ణమార్కెట్లోని దారులన్నీ నీట మునిగాయి. నగరంలోని జైలు రోడ్డు పరిసరాల్లో అత్యధికంగా 59 మి.మీ, ప్రభుత్వ ఐ హాస్పటల్ ప్రాంతంలో 53.7 మి.మీ, ఆర్కే బీచ్ పరిసరాల్లో 47.8 మి.మీ చొప్పున భారీ వర్షపాతం నమోదైంది. వాతావరణం ప్రతికూలంగా ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications