బాబుకు చుక్కలు చూపిన 'సాక్షి': జగన్ దెబ్బకి 'హెరిటేజ్' వెనక్కి
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దెబ్బకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెరిటేజ్ పైన అధికారులు దిగి వచ్చారు. వేసవి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు చల్లటి మజ్జిగ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
విజయనగరం జిల్లా కలెక్టర్ జిల్లాలో గల హెరిటేజ్ డెయిరీ నుంచి పెరుగు కొనాలని లిఖిత పూర్వకంగా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిని సాక్షి మీడియాలో ప్రముఖంగా ప్రచురించింది. వైసిపి ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీంతో, జిల్లా కలెక్టర్ ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకొని మళ్ళీ తాజాగా మరో ఉత్తర్వులను జారీ చేశారు. హెరిటేజ్ సంస్థ నుంచి మాత్రమే పెరుగు, మజ్జిగ కొనమని తనకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆదేశాలు రాలేదని, విశాఖ డెయిరీ సంస్థ కేవలం విజయనగరం పట్టణంలో మాత్రమే సరఫరా చేయగలమని చెప్పడంతో సమీపంలో ఉన్న హెరిటేజ్ డెయిరీ నుంచి పెరుగు తీసుకొన్నామని దానిని రాజకీయం చేయవద్దని కలెక్టర్ కోరారు.
జిల్లాలో గల విశాఖ, హెరిటేజ్, తిరుమల, జెర్సీ సంస్థలతో పాటు ఇతర కో-ఆపరేటివ్ మరియు వాణిజ్య సంస్థల నుంచి కూడా ఇది వరకు ప్రకటించిన ధరకే పెరుగు కొనుగోలు చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు ప్రజలకు హెరిటేజ్ మజ్జిగ తాగిద్దామనుకుంటే సాక్షి, వైసిపి ఆయనకే విశాఖ మజ్జిగ తాగించాయని సెటైర్లు వేస్తున్నారు.
కాగా, వేసవి వడగాల్పుల నుంచి ప్రజల రక్షణ కోసమంటూ ఏపీ సర్కార్ ప్రవేశపెట్టిన మజ్జిగ సరఫరా పథకం విమర్శలకు వేదికగా మారిన విషయం తెలిసిందే. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ఏపీలోని ప్రజలకు 45 రోజులపాటు మజ్జిగ సరఫరా చేస్తామంటూ ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు.
ఈ పథకం కోసం జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున 13 జిల్లాలకు రూ.39 కోట్లు కేటాయించారు. మజ్జిగను అన్ని జిల్లాల్లో ఉన్న హెరిటేజ్ నుంచి కొనుగోలు చేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఏపీ సర్కార్ మజ్జిగ సరఫరా పథకాన్ని సొంత కంపెనీ హెరిటేజ్కు కట్టబెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.