రాష్ట్రంలో ఓటరుగా నా అభిప్రాయం ఏమిటంటే: బాలకృష్ణ
ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎమర్జెన్సీ పరిస్థితులున్నాయని, నటుడిగా, ఎమ్మెల్యేగా, ఓటరుగా తన అభిప్రాయాలు చెబుతున్నానని వ్యాఖ్యానించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి ఎస్వీ థియేటర్లో బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రాన్ని చూశారు. నారావారిపల్లె నుంచి కారులో చంద్రగిరిలోని ఎస్వీ సినిమాస్ థియేటర్కి చేరుకున్న బాలకృష్ణకు అక్కడ అభిమానులు ఘన స్వాగతం పలకడంతోపాటు . జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. ఎస్వీ సినిమాస్ థియేటర్ అంతా కోలాహలంగా మారిపోయింది. అనంతరం అభిమానులు, నారా, నందమూరి కుటుంబాలతో కలిసి బాలకృష్ణ 'వీర సింహారెడ్డి'చిత్రాన్ని వీక్షించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అఖండ తర్వాత తన నుంచి ఎలాంటి సినిమా వస్తుందోననే ఆసక్తి అందరిలో నెలకొందని, అటువంటి తరుణంలోనే వీరసింహారెడ్డిని ప్రేక్షకులకు అందించినట్లు వెల్లడించారు. ఆకలితో ఉన్న అభిమానులకు విందు భోజనం లాంటి మంచి సినిమాను అందించామన్నారు. ఇది ఫ్యాక్షన్ సినిమా కాదని, కుటుంబ సమేతంగా అందరూ వచ్చి చూసే సినిమా అన్నారు. చాలామంది భావోద్వేగానికి గురయ్యారని, ఏ విషయంలో కూడా రాజీపడకుండా దర్శక, నిర్మాతలు సినిమాను బాగా తీశారంటూ కొనియాడారు. సినిమా అనేది ఒక్కడివల్ల ఆడదని, అందరి కృషి అని తాను నమ్ముతానన్నారు. మంచి సినిమాను ప్రేక్షకులు మరోసారి ఆదరిస్తారని రుజువైందని, మలినేని గోపీచంద్ తన అభిమానిగా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడన్నారు. అభిమానుల ఊహలకు తగ్గట్లుగా చిత్రాన్ని తెరకెక్కించారని, తమన్ అదరగొట్టాడని, ఆణిముత్యాల్లాంటి పాటలకు మణిపూసలాంటి బాణీలు సమకూర్చాడన్నారు. బీజీఎం అద్భుతంగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications