అమరావతి రైతులకు 17వ తేదీ డెడ్ లైన్: అదే రోజు హైపవర్ కమిటీ భేటీ: ఆ వెంటనే నివేదిక..!
రాజధాని ప్రాంత రైతులకు ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. మూడు రాజధానుల ప్రతిపాదనలు..అమరావతి నుండి విశాఖకు పరిపాలనా రాజధాని తరలింపు ఆలోచనలపైన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. 27 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. రాజధానుల అంశం మీద జీఎన్ రావు..బోస్టన్ కమిటీలు ఇచ్చిన నివేదికల పైన అధ్యయనం కోసం ఏర్పాటైన హైపవర్ కమిటీ ఈ రోజు సమావేశంలో రైతుల అంశం పైనే ప్రధానంగా చర్చించింది. ఇందులో రైతుల నుండి సూచనలు..సలహాలు స్వీకరించాలని నిర్ణయించింది. అందుకోసం 17వ తేదీ సాయంత్రం వరకు సమయం ఇచ్చింది. ఆదే రోజు సాయంత్రం కమిటీ మరో సారి సమావేశమై..తమ నివేదికకు తుది రూపు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు పైన కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రులు మండిపడ్డారు. ఆయన కమెడియన్ లా తయారయ్యారని ఎద్దేవా చేసారు. డీజీపీ గురించి మాట్లాడుతున్న తీరును మంత్రులు తప్పు బట్టారు.
అన్నీ జిల్లాల అభివృద్ధి పై చర్చించాం...
హైపవర్ కమిటీ మూడో విడత సమావేశంలో అన్నీ జిల్లాల అభివృద్ధి పై చర్చించామని మంత్రులు స్పష్టం చేసారు. అమరావతి ప్రాంత రైతులు తమ అభ్యంతరాలను..సూచనలు..సలహాలను ఈ నెల 17వ తేదీ లోగా సీఆర్డీఏ కమిషనర్ కు తెలియచేయాలని కమిటీ సూచించింది. ప్రభుత్వం దేని గురించి అభ్యంతరాలు ఆహ్వానిస్తోందో రైతులకు తెలుసని మంత్రులు వ్యాఖ్యానించారు. ఇప్పటికే రైతులు తనతో పాటుగా, మంత్రి బొత్స, కొడాలి నానిని కలిసారని మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు. 29 గ్రామాల రైతులు, ప్రజలు సీఆర్డీఏ కమిషనర్ కు ఇమెయిల్ ద్వారా కానీ, రాత పూర్వకంగా కానీ తమ సూచనలు, సలహాలు, అభ్యంతరం కూడా తెలియచేయచ్చని కమిటీ స్పష్టం చేసింది. తాము ప్రభుత్వానికి అందించే నివేదికలో వారి అభిప్రాయాలకు సైతం విలువ ఇస్తామని మంత్రులు స్పష్టం చేసారు.

మరోమారు 17 తేదీ హై పవర్ కమిటీ భేటీ
రైతులకు 17వ తేదీ సాయంత్రం వరకు అభ్యంతరాలు చెప్పటానికి సమయం ఇచ్చిన హైపర్ కమిటీ అదే రోజు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది. అదే విధంగా తాము అన్ని జిల్లాల డెవలప్ మెంట్ కు కట్టుబడి ఉన్నామని మంత్రులు స్పష్టం చేసారు. రైతులు చాలా మంది వ్యక్తిగతంగా వచ్చి మంత్రులను కలుస్తున్నారని చెప్పుకొచ్చారు. రైతుల్లో బయటి వారిని తీసుకొచ్చి దాడులకు టీడీపీ ప్రేరేపిస్తోందని మంత్రులు ఆరోపించారు. చంద్రబాబు సినీ కమెడియన్ బ్రహ్మానందంలా తయారయ్యారని ఎద్దేవా చేసారు. తాను సంతోషంగా ఉంటేనే..అందరూ సంతోషంగా ఉండాలనే ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అదే విధంగా డీజీపీ గురించి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను మంత్రులు తప్పు బట్టారు. ఆయన ప్రాంతాన్ని..ఆయన పైన చేస్తున్న వ్యాఖ్యలు సరి కాదని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications