నారాయణ కుమార్తెలు - అల్లుడికి రిలీఫ్ : హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు - మరో పది మందికి..!!
పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. చిత్తూరులో నమోదైన కేసులో మాజీ మంత్రి పి.నారాయణ కుమార్తెలు పొంగూరు శరణి, పొంగూరు సింధూర, అల్లుడు కె.పునీత్తో పాటు నారాయణ విద్యాసంస్థలకు చెందిన మరో 10 మందికి హైకోర్టులో ఊరట లభించింది. పిటిషనర్లపై బుధవారం (18వ తేదీ) వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. పూర్తి స్థాయి విచారణను అదే రోజుకు వాయిదా వేశారు.
నారాయణ విద్యాసంస్థల పిటీషన్
చిత్తూరు టాకీస్ వాట్సప్ గ్రూప్లో పదో తరగతి తెలుగు ప్రశ్నప్రతాన్ని గుర్తుతెలియని వ్యక్తులు పోస్టు చేసినట్లు చిత్తూరు డీఈవో పురుషోత్తం ఏప్రిల్ 27న చిత్తూరు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో ప్రమేయం ఉందని మాజీ మంత్రి నారాయణను మే 10న చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు.
అయితే.. చిత్తూరులోని నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఇన్ఛార్జి న్యాయమూర్తి సులోచనా రాణి వ్యక్తిగత పూచీకత్తుపై నారాయణకు బెయిలు మంజూరు చేశారు. ఇదే కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని నారాయణ కుమార్తెలు శరణి, సింధూర, అల్లుడు పునీత్తో పాటు పలు విద్యాసంస్థలకు చెందిన మరో 10 మంది సిబ్బంది హైకోర్టును ఆశ్రయించారు. తమ పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు.
ఎటువంటి చర్యలు వద్దంటూ ఆదేశం
ఈ మేరకు విచారణ చేపట్టిన న్యాయస్థానం.. అందరికీ ఈ నెల 18 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వ్యాజ్యాలపై పూర్తి స్థాయి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో చిత్తూరు జిల్లా డీఈవో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చిత్తూరు వన్టౌన్ పోలీస్ స్టేషన్లో మాల్ ప్రాక్టీస్ నిరోధక చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద నారాయణ విద్యాసంస్థలపై కేసు నమోదైంది.
2014లోనే ఆ విద్యాసంస్థల చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు నారాయణ ఆధారాలు చూపించడంతో అదే రోజు చిత్తూరు 4వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో ఇప్పుడు పోలీసులు తమను అరెస్టు చేసే అవకాశం ఉందని పిటీషన్ లో పేర్కొన్నారు.
నారాయణ విద్యా సంస్థల్లో మరో పది మందికి
ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నారాయణ కుమార్తెలు -అల్లుడు దాఖలు చేసిన పిటీషన్లపైన విచారణ జరిగింది. పిటిషనర్లకు మాల్ ప్రాక్టీస్ వ్యవహారంతో సంబంధం లేదని.. పోలీసులు నమోదు చేసిన కేసులో వారిని నిందితులుగా పేర్కొనలేదని పిటీషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. పిటిషనర్లను నిందితులుగా పేర్కొననప్పుడు ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం లేదంటూ పోలీసుల తరపు న్యాయవాది పేర్కొన్నారు. దీంతో..ఈ నెల 18వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని న్యాయమూర్తి స్పష్టం చేసారు.