అమరావతి నిర్మాణం: స్విస్ చాలెంజ్పై హైకోర్టు వ్యాఖ్యలు
హైదరాబాద్/న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న స్విస్ చాలెంజ్ విధానం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. స్విస్ చాలెంజ్ విధానంపై విచారణను హైకోర్టు మంగళవారంనాటికి వాయిదా వేసింది. ఎపి అడ్వొకేట్ జనరల్ సోమవారం కూడా తన వాదనలు వినిపించారు.
ఇదిలావుంటే, రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్షియం చేసిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ జారీ అయిన నోటిఫికేషన్లలో తదుపరి చర్యలను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టి్ రామచంద్రరావు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యద్రర్శి, సిఆర్డిఎ కమిషనర్ ధర్మానం ముందు అపీల్ దాఖలు చేశారు.
కాగా, ఏపీ రాజధాని అమరావతిలో చేపట్టిన నిర్మాణాలు ఆపేయాలంటూ ఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో దాఖలైన పిటిషనపై సోమవారం విచారణ జరిగింది. శ్రీమన్నారాయణ అనే జర్నలిస్టు ఈ పిటిషన్ వేశారు. పర్యావరణానికి హానీ కలిగిస్తూ ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నారని పిటిషనర్ ఆరోపించారు.
కృష్ణానదీ తీరంలో ఉన్న ఇది ముంపు ప్రాంతమని, పర్యావరణ అనుమతులు తీసుకోలేదని ట్రిబ్యునల్ ఎదుట పిటిషనర్ వాదించారు. నిర్మాణాలవల్ల పచ్చటి పొలాలు పాడైపోయాయని, కూరగాయల సాగు నిలిచిపోయిందని, సరైన అంచనాలు లేకుండానే నగర నిర్మాణం చేపడుతున్నారని ఆయన అన్నారు. భోజన విరామానికి ముందు ఈ అంశంపై అరగంటకుపైగా వాదనలు వినిపించారు.
అయితే, అమరావతి నగర నిర్మాణంలో పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేదని, కొండవీటి వాగు ముంపు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వాదనలు వినిపించింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అమరావతి నగర నిర్మాణం చేపట్టామని పర్యావరణానికి సంబంధించి ప్రాథమిక అనుమతులు కూడా వచ్చాయని తెలిపింది.
పూర్తి స్థాయి అనుమతులు సాధన దిశగానే ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు వెళ్లడంలేదని, అన్ని ప్రమాణాలు పాటిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరికొన్ని డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉండడంతో తదుపరి విచారణను ట్రిబ్యునల్ ఈనెల 30కి వాయిదా వేసింది.