మదర్ కిట్ టెండర్ల పథకం ఆపండి:ఎపి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
అమరావతి: ప్రభుత్వాస్పుత్రుల్లో బాలింతలకు అందించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన 'బసవ తారకం మదర్ కిట్' పథకం అమలును నిలిపివేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది.
ఈ 'మదర్ కిట్' పథకం టెండర్లను ఖరారుచేసిన తీరును వ్యతిరేకిస్తూ, మాయరిన్ అనే సంస్థ ప్రతినిధులు ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి మంగళవారం విచారించారు. ఈ టెండర్ల ప్రక్రియ నిబంధనలకు విరుద్దంగా జరిగిందన్న పిటిషనర్ల వాదనలు ఆలకించిన న్యాయమూర్తి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ కోరుతూ, తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. వివరాల్లోకి వెళితే...
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం బాలింతల కోసం బసవతారకం మదర్ కిట్ల పంపిణీ పథకం అమలు చేసేందుకు సంసిద్దమైంది. అయితే ఈ పథకం అమలు చేసే సంస్థను ఎంపికచేసేందుకు చేపట్టిన టెండర్ల ప్రక్రియ నిబంధనలకు విరుద్దంగా జరిగిందని ఆరోపిస్తూ మారియన్ అనే సంస్థ హై కోర్టును ఆశ్రయించింది. దీంతో 'బసవ తారకం మదర్ కిట్' టెండర్లను శుక్రవారం దాకా ఖరారు చేయొద్దని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది.
హై కోర్టులో విచారణ సందర్భంగా టెండర్ల ప్రక్రియ జరగాల్సిన విధానం గురించి ఆరోపిస్తూ ...''మదర్ కిట్లో అందించే సామాగ్రికి సంబంధించిన నమూనాలను ముందుగా సదరు సంస్థ జాతీయ కార్పొరేషన్కు పంపాలి...ఆ కార్పొరేషన్ ఇచ్చే నివేదికను బట్టి, ఆ సంస్థకు టెండరును ఖరారు చేయాలా లేదా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి...అయితే, ఇందుకు భిన్నంగా పవన్ శిల్క్, అనిత టెక్స్ అనే కంపెనీలకు ప్రభుత్వం రూ.50 కోట్ల విలువైన టెండర్లు ఖరారు చేసింది"...అని పిటిషనర్లు వాదించారు. వారి వాదనలు విన్న న్యాయమూర్తి, దీనిపై ప్రభుత్వ వివరణ కోరుతూ, తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.
చీర, ప్లాస్క్, స్కార్ప్, దుప్పటి, శానిటరీ నాప్కిన్స్...ఈ ఐదు వస్తువులను ఒక కిట్లో పెట్టి బాలింతలకు అందించనుంది. ఈక్రమంలో మంగళవారం ఉండవల్లి ప్రజావేదిక హాలులో 'బసవ తారకం మదర్ కిట్లను' ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా కొందరు బాలింతలకు అందజేశారు. ఆ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ "ఆస్పత్రిలో అడుగుపెట్టి పురుడుపోసుకొని పండంటి బిడ్డను కన్న తల్లి. ఏ దశలోనూ ఎలాంటి ఇబ్బందికీ గురి కాకూడదని, తల్లిబిడ్డలు సంతోషంగా ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆశయం"...అని చెప్పారు.
పథకం అమలు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం గురించి వివరిస్తూ...'ప్రభుత్వాస్పత్రికి వచ్చే గర్భిణులంతా దాదాపు నిరుపేదలై ఉంటారు. కనీసం మందులు కొనుక్కొనే స్తోమతా ఉండదు. ఇక ప్రసవం అనంతరం బాలింతలు ఆరోగ్య రక్షణకు తీసుకునే జాగ్రత్తలు శూన్యమే. రాష్ట్రంలో మాత, శిశు మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించాలనే నిర్ణయించుకొన్న ప్రభుత్వం, ప్రతి బాలింత ఆరోగ్య సంరక్షణకూ చర్యలు చేపట్టింది. దీనికోసం ఉద్దేశించినదే 'బసవ తారకం మదర్ కిట్' అని వివరించారు. అయితే ఈ పథకం అమలుకు ఎంపిక చేసిన సంస్థను నిబంధనలకు విరుద్దంగా చేశారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన క్రమంలో కోర్టు ఆదేశాలను అనుసరించి ఈ పథకం అమలు నిలిచిపోయింది.