కొత్త జిల్లాల ఏర్పాటు పై హైకోర్టులో విచారణ - ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశం..!!
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతోంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఉగాది నాడు కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమయ్యేలా నిర్ణయించారు. దీనికి సంబంధించి కసరత్తు కొనసాగుతోంది. ఇదే సమయంలో హైకోర్టులో కొత్త జిల్లాల ఏర్పాటు పైన పిల్ దాఖలైంది. కొత్త జిల్లాల ఏర్పాటు అధికరణ 371-డికి, 'ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల (స్థానిక కేడర్ నిర్వహణ, నేరుగా నియామకాల క్రమబద్ధీకరణ) ఉత్తర్వులు-1975కు విరుద్ధంగా ఉందని పిటీషనర్లు పేర్కొన్నారు.
కొత్త జిల్లాలపై హైకోర్టులో పిల్
రాష్ట్రపతి ఉత్తర్వుల నేపథ్యంలో 'ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల (స్థానిక కేడర్ నిర్వహణ, నేరుగా నియామకాల క్రమబద్ధీకరణ) ఉత్తర్వులు-1975ను తీసుకొచ్చారు. అందులోని రెండో షెడ్యూల్ ప్రకారం ఏపీలోని జిల్లాలను మొత్తం ఏడు జోన్లుగా ఏర్పాటు చేశారు. విభజన అనంతరం ఏపీలో 4 జోన్లు మిగిలాయి. కొత్త జిల్లాలతో వాటి స్వరూపం మారిపోతోందని పిటీషనర్లు కోర్టుకు వివరించారు.
రాష్ట్రపతి ఉత్తర్వుల నేపథ్యంలో లోయర్ డివిజన్ పోస్టుల భర్తీ విషయంలో జిల్లాను యూనిట్గా పరిగణిస్తున్నారు. దానిని రాష్ట్ర ప్రభుత్వం మార్చలేదని పిటీషన్ లో చెప్పకొచ్చారు. గుంటూరు జిల్లా అప్పాపురం గ్రామానికి చెందిన దొంతినేని విజయ్ కుమార్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన బి.సిద్ధార్థ, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన జాగర్లమూడి రామారావు ఈ పిల్ దాఖలు చేసారు.
పలు అంశాలతో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ
కొత్త జిల్లాల ఏర్పాటుతో గతంలో నిర్ణయించిన జోన్లు, రెవెన్యూ డివిజన్లలో మార్పులు చోటుచేసుకుంటాయని.. అలా మార్చే అధికారం రాష్ట్రానికి లేదని పిటీషనర్లు తమ పిల్ లో వివరించారు. దీని పైన హైకోర్టు విచారించింది. ఈ పిల్ కు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి తుది ప్రకటన వెలువడక పోవటంతో మధ్యంతర ఉత్తర్వులు జారీకి న్యాయస్థానం నిరాకరించింది. దీని పైన తదుపరి విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది.
Recommended Video
కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి ఆదేశం
దీని ద్వారా ప్రభుత్వం ఇప్పుడు హైకోర్టులో కొత్త జిల్లాల ఏర్పాటు పైన హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. ఇక, మరో పదిహేను రోజుల సమయం ఉండటంతో ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు న్యాయ పరంగా చిక్కులు లేవని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. అభ్యంతరాల స్వీకరణ పూర్తి కావటంతో..వీటి పరిష్కారం పైన నిర్ణయించిన తరువాత ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేయనుంది.