సోమవారం దాకా సస్పెన్స్: స్విస్ ఛాలెంజ్పై ఎందుకంత గోప్యత?
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం తీసుకచొచ్చిన స్విస్ ఛాలెంజ్ విధానంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్విస్ ఛాలెంజ్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గోప్యతను పాటిస్తుందంటూ హైకోర్టు మొట్టికాయలు వేసింది.
అంతేకాదు స్విస్ ఛాలెంజ్ విధానం గురించి ముందుగా చెప్పి ప్రకటనలు ఇచ్చి ఉంటే, మరిన్ని కంపెనీలు వేలంలో పాల్గొనేవనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీనిపై ప్రభుత్వ తరుపు న్యాయవాది స్పందిస్తూ స్విస్ ఛాలెంజ్ విధానానికి సంబంధించిన అన్ని వివరాలను వెల్లడిస్తామని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది.
ఇందుకు కొంత సమయం కావాలని కోరగా, మధ్యాహ్న భోజన విరామం తరువాత 2:30 గంటలకు కేసు విచారణ కొనసాగిస్తామని చెబుతూ వాయిదా వేసింది. వాయిదా అనంతరం ప్రారంభమైన విచారణలో భాగంగా కౌంటర్ ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ గడువు కోరారు.
దీంతో వాదనలు విన్న హైకోర్టు అమరావతి స్విస్ ఛాలంజ్ పిటిషన్ను సోమవారానికి వాయిదా వేసింది. అమరావతి నిర్మాణంలో స్విస్ ఛాలెంజ్ విధానం మొదట నుంచి వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. స్విస్ ఛాలెంజ్ విధానంలో విదేశీ సంస్ధలకు కాంట్రాక్టలను అప్పగించడాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆదిత్య హౌసింగ్ పిటిషన్ దాఖలు చేసింది.
చంద్రబాబుకు ప్రచార పిచ్చి పట్టుకుంది: భూమన కరుణాకర్రెడ్డి
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. శుక్రవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తన పార్టీ ప్రచారం కోసమే పాకులాడుతున్నారని ఆరోపించారు.
కృష్ణా పుష్కరాలను చంద్రబాబు తన ప్రచారం కోసం ఉపయోగించుకున్నారని ఆయన అన్నారు. అన్ని రంగాల్లో టెక్నాలజీ వినియోగం అంటూ ముఖ్యమంత్రి కొత్త డ్రామాకి తెరలేపారని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు ప్రచార పిచ్చిలో పడ్డారని ఆయన విమర్శించారు.