ఎదురుదెబ్బ: ఏపి రాజధాని భూసేకరణకు హైకోర్టు స్టే
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపి రాజధాని భూసేకరణకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. రెండు వారాలపాటు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. జూన్ మొదటి వారానికి విచారణ వాయిదా వేసింది.
కాగా, భూ సేకరణ కోసం మే 14న జీవో నెంబర్ 166ను ఏపి ప్రభుత్వం తీసుకొచ్చిని విషయం తెలిసిందే. పంటలు పండే భూములను మినహాయిస్తామని కోర్టులో ప్రభుత్వం తెలిపింది. దీనిపై కౌంటర్కు గడువు కావాలని ప్రభుత్వం కోరింది.
రెండు వారాలపాటు స్టే ఇస్తే మీకు నష్టమేంటని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వం కొంత ఇరకాటంలో పడినట్లయింది. కాగా, మే 31న ప్రభుత్వం భూసేకరణ చేయాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉండగా, ఏపి రాజధాని కమిటీతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. రాజధానితో ముడిపడి వున్న భూ సేకరణ, ఇతరత్రా అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఎంపి గల్లా జయదేవ్ సహా ఇతర కమిటీ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం మంత్రి మాట్లాడుతూ.. హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదని చెప్పారు. 15 రోజుల గడువు కోరామని చెప్పారు.