నిరుద్యోగ యువత జీవితాలతో ఆటలాడొద్దు జగన్ - హోంమంత్రి అనిత హెచ్చరిక!
ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువత జీవితాలతో రాజకీయాలు చేయకూడదని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాలపై తప్పుడు ప్రచారాలు చేస్తూ యువత ఆశలను నాశనం చేస్తున్నారని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. మెగా డీఎస్సీని వదలకుండా టార్గెట్ చేస్తున్న వైసీపీ చేసేవి తప్పుడు ఆరోపణలు, వారు చేస్తున్నవి తప్పుడు ప్రచారాలని ఆమె పేర్కొన్నారు.
కష్టపడి చదువుకుని, పరీక్షలు రాసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతీయువకుల భవిష్యత్తుతో ఆటలాడటం సమంజసం కాదని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. జగన్ తన రాజకీయ లబ్ధి కోసం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తన యువతలో నిరాశను పెంచుతుందని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించడాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందని హోంమంత్రి స్పష్టం చేశారు.

అర్హత, ప్రతిభ ఆధారంగానే నియామకాలు జరుగుతాయని, పారదర్శకతలో ఎలాంటి రాజీ లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వ వ్యవహారాల్లో పారదర్శకతను కాపాడుతూ యువత భవిష్యత్తును సురక్షితంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్లో వీడియోను పోస్ట్ చేసి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు నిజమైన అవకాశాలు కల్పించాలని, రాజకీయ ప్రయోజనాల కోసం వారి ఆశలను దెబ్బతీయకూడదని స్పష్టంగా చెప్పారు.
కూటమి ప్రభుత్వం యువత అభ్యున్నతికి కట్టుబడి ఉందని హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతను కన్ఫ్యూజన్ కు గురి చేయటం మంచిది కాదని వైసీపీ శ్రేణులకు, వైసీపీ అధినేత జగన్ కు హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు ఇదిలా ఉంటే డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం పైన మాజీ సీఎం జగన్ నిత్యం సంచలన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారి అంశాలను ప్రస్తావిస్తూ జగన్ కీలక ప్రశ్నలు సంధిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, మంత్రి లోకేష్ లక్ష్యంగా జగన్ ఆరోపణలు కొనసాగుతున్నాయి. అయితే జగన్ చేస్తున్న వ్యాఖ్యలకు, వేస్తున్న ప్రశ్నలకు అటు విద్యాశాఖ- శాప్ అధికారులు వివరణ ఇస్తున్నారు. టీడీపీ నేతలు కూడా అనేకమార్లు జగన్ ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు. అయితే.. జగన్ ఉద్యోగం పొందిన వారి సర్టిఫికెట్ల ఆధారంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.
ముఖ్యమంత్రిని ఈ క్రమంలో వైఎస్ జగన్ టార్గెట్ చేస్తున్నారు. డీఎస్సీ నియామకాలను నిజంగా నిష్పక్ష పాతంగా..పారదర్శకంగా నిర్వహించాలన్నదే మీ ఉద్దేశమైతే అర్హత పరీక్ష అవసరం లేకుండా జీవోలు ఎందుకు జారీ చేశారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. క్వాలిఫైయింగ్ పరీక్ష నిబంధనను పక్కనపెట్టి నియామకాలను ఎందుకు చేపట్టారని నిలదీస్తున్నారు. దీనిపైన సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
