ఫోటో ఎగ్జిబిషన్లో బాబాయ్ హత్య ఫోటోలు పెడితే హైలెట్ గా ఉంటుంది జగన్!!
ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర వైసిపి అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో వైసిపి కార్యకర్తల పైన జరుగుతున్న దాడుల పైన, ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని జగన్ ధర్నా చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధర్నాపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
జగన్ పై ఘాటు విమర్శలు చేసిన హోం మంత్రి అనిత
రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలు ఉంటాయని, కానీ వైసీపీకి అబద్ధపు ప్రచారాలు చేయడం, నంగనాచికబుర్లు చెప్పడమే సిద్ధాంతమని వంగలపూడి అనిత మండిపడ్డారు. వైనాట్ 175 అని కబుర్లు చెప్పి 11 సీట్లకు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలకు గౌరవం ఇవ్వకుండా మిడిసిపడ్డారని, ఇప్పుడు రాష్ట్రంలో తిరగడానికి మొహం చెల్లడం లేదని వంగలపూడి అనిత జగన్ పై విమర్శలు గుప్పించారు.

అసెంబ్లీలో కాలు పెట్టడానికి జగన్ కు మొహం చెల్లడం లేదు
రాజకీయాలకు సంబంధం లేని వినుకొండ హత్యను రాజకీయం చేస్తున్నారని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తుగ్లక్ రెడ్డి ధర్నా చేపట్టారని విమర్శించారు. పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కాలు పెట్టడానికి జగన్ కు మొహం చెల్లడం లేదని మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు పెట్టుబడులు తెస్తుంటే వాటిని అడ్డుకోవడానికి జగన్ ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నాడని వ్యాఖ్యలు చేశారు.
జగన్ నిద్రలో కూడా రెడ్ బుక్ ను తలుచుకుంటున్నారు
జగన్ ఢిల్లీలో పెట్టిన ఫోటో ఎగ్జిబిషన్లో బాబాయ్ హత్య కేసు, తోట చంద్రయ్య హత్య కేసుల ఫోటోలు కూడా పెట్టాలంటూ, అలా పెడితే హైలెట్ గా ఉంటుందన్నారు వంగలపూడి అనిత . పులివెందుల ఎమ్మెల్యే కొత్త ప్రభుత్వంలో 36 రాజకీయ హత్యలు జరిగాయని చెబుతున్నారని, ఆధారాలతో వస్తే చర్చకు సిద్ధమన్నారు. జగన్ నిద్రలో కూడా రెడ్ బుక్ ను తలుచుకుంటున్నారని వంగలపూడి అనిత విమర్శించారు.
ప్రతిపక్ష హోదా అడుక్కుంటే వచ్చేది కాదు
జగన్ ఢిల్లీలో ధర్నాలు చేయడం పైన ఆయన సోదరి షర్మిల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన వంగలపూడి అనిత జగన్ పైన సెటైర్లు వేశారు. ఇండియా కూటమి నేతలు వాస్తవాలు తెలియక జగన్ ధర్నాకు మద్దతు తెలిపి ఉంటారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో ఏపీలో ప్రతిపక్ష హోదా అడుక్కుంటే వచ్చేది కాదని, ప్రజలు ఇవ్వాలని జగన్ కు వంగలపూడి అనిత చురకలంటించారు.












Click it and Unblock the Notifications