'కాపు యువతకి 2 లక్షలిస్తాం': బీసీలకు నష్టం లేకుండా.. బాబుకు చిక్కులేనా?
రాజమండ్రి: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపులను మోసం చేస్తున్నారని కాపు కార్పోరేషన్ డైరెక్టర్ యర్రా వేణుగోపాల రాయుడు సోమవారం నాడు ఆరోపించారు. ఇంతకాలం లేనిది ఇప్పుడు ఆయనకు కాపులు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు.
తూర్పు గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రుణాలు మంజూరు చేయనున్నట్లు యర్రా వేణుగోపాల రాయుడు చెప్పారు. ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేస్తారన్నారు.
ఒక్కో వ్యక్తికి రూ.2 లక్షల చొప్పున రుణాలిస్తారని, దీనిలో రూ.50 వేలు రాయితీ కల్పిస్తారన్నారు. జిల్లాకు 3,293 యూనిట్లు మంజూరు చేశారన్నారు. రుణాలకోసం రూ.9.68 కోట్లు మంజూరయ్యాయన్నారు. కాపుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా కట్టుబడి ఉందన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు కమిషన్ వేశారని, తొమ్మిది నెలల్లో నివేదిక వస్తుందన్నారు.
'కాపులను కలిపితే బీసీలకు నష్టం'
బీసీకు నష్టం లేకుండా కాపులను బీసీల్లో కలపడం సాధ్యం కాదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకరరావు వేరుగా అన్నారు. రాష్ట్ర జనాభాలో 50 శాతం రాయితీలు కల్పించాల్సి ఉండగా కేవలం 25 శాతం రాష్టంలో, 27 శాతం కేంద్రంలో మాత్రమే రిజర్వేషన్లు కల్పించడంతో బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.
ఇప్పటికే బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య.. కాపులను బీసీలలో చేర్చవద్దని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కాపులను బీసీలలో చేర్చితే ప్రతిఘటిస్తామని రెండు రోజుల క్రితం చెప్పారు.
తూర్పు గోదావరి జిల్లాలో బీసీలు 50 శాతంకు పైగా ఉన్నప్పటికీ కనీసం పదిమంది ఎమ్మెల్యేలు లేకపోవడం.. బీసీలకు అన్యాయం జరుగుతోందనడానికి నిదర్శనం అన్నారు. కాపులను బీసీల్లో చేర్చితే తమకు అన్యాయం చేసినట్లే అన్నారు. ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందిన కాపులను బీసీల్లో చేర్చాల్సిన అవసరం లేదన్నారు.