అంతులేని లైంగిక సామర్థ్యం.. ఆ ప్రచారంతో గాడిద మాంసానికి విపరీతమైన డిమాండ్.. ఏపీలో వింత పోకడ..
సాధారణంగా గాడిద పాలకు ఉండే డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయన్న ప్రచారం, రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు పరిపుష్టిగా ఉంటాయన్న కారణంతో చాలామంది గాడిద పాలను సేవిస్తుంటారు. అందుకే లీటర్ గాడిద పాలకు మార్కెట్లో రూ.6వేల వరకు ధర పలుకుతుంటుంది. అయితే గాడిద పాలకే కాదు... గాడిద మాంసానికి కూడా ఇప్పుడు భారీ డిమాండ్ ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో చాలామంది గాడిద మాంసాన్ని ఆరగించేస్తున్నారు. గాడిద మాంసం చుట్టూ జరుగుతున్న కొన్ని రకాల ప్రచారాలతో దాని గిరాకీ విపరీతంగా పెరిగిపోయింది. ఎంతలా అంటే.. అసలు రాను రాను రాష్ట్రంలో ఇక గాడిదలు కనిపిస్తాయా అనేంతలా...!!
ఎందుకింత డిమాండ్...
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గాడిద మాంసానికి ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ నెలకొంది. గాడిద మాంసం తినడం ద్వారా అంతులేని లైంగిక శక్తి,సామర్థ్యాలు పెరుగుతాయని జరుగుతున్న ప్రచారమే దీనికి కారణం. దీంతో జనం విరగబడి గాడిద మాంసాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో జనాల్లో ఉన్న ఈ ప్రచారాన్ని క్యాష్ చేసుకునేందుకు కొన్ని ముఠాలు అక్రమంగా గాడిదలను వధిస్తూ మాంస విక్రయాలు జరుపుతున్నాయి.
కిలో గాడిద మాంసం ఎంతంటే...
నిజానికి పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో గాడిదల సంఖ్య తక్కువే. అదే సమయంలో రోజురోజుకు దాని మాంసానికి పెరుగుతున్న డిమాండుతో క్రమంగా రాష్ట్రంలో అవి కనుమరుగైపోతున్నాయి. దీంతో పక్క రాష్ట్రాలైన తమిళనాడు,కర్ణాటక,మహారాష్ట్ర,రాజస్తాన్,ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి గాడిదలను ఏపీకి అక్రమంగా తరలిస్తున్నారు. గాడిద మాంసం కోసం ప్రత్యేక దుకాణాలు తెరిచి విక్రయాలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఏపీలో కిలో గాడిద మాంసం రూ.600 పైచిలుకు ఉంది. అంటే,దాదాపుగా మేక మాంసానికి సరిసమానంగా ధర పలుకుతోంది. ఒక్కో గాడిద రూ.15వేల నుంచి రూ.20వేల వరకు ధర పలుకుతున్నట్లు తెలుస్తోంది.
గాడిద రక్తానికి కూడా డిమాండ్...
గాడిద మాంసం తినడం ద్వారా లైంగిక శక్తి,సామర్థ్యాలతో పాటు వెన్ను నొప్పి,ఆస్తమా తదితర దీర్ఘకాలిక సమస్యలు,వ్యాధులు నయమవుతాయన్న ప్రచారం జరుగుతోంది. దీంతో జనం గాడిద మాంసానికి ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడట్లేదు. ఈ మాంసం తిన్న తర్వాత దాన్ని అరిగించుకోవడానికి 2కి.మీ పరిగెత్తాలన్న ప్రచారం కూడా ఉంది. చాలామంది జనం దీన్ని కూడా పాటిస్తున్నట్లు తెలుస్తోంది.గాడిద మాంసమే కాదు,గాడిద రక్తానికి కూడా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రకాశం జిల్లాలోని కొంతమంది మత్స్యకారులు వేటకు వెళ్లేముందు తప్పనిసరిగా గాడిద రక్తం తాగి వెళ్తారని తెలుస్తోంది.
చట్టాలు ఏం చెప్తున్నాయి...
నిజానికి కబేళా నిబంధనలు 2021 ప్రకారం గాడిదలను వధించడం నిషేధం. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్-2011 ప్రకారం గాడిద మాంసం కోసం పెంచే జంతువుగా పరిగణించరు. కాబట్టి ఇందుకు విరుద్దంగా గాడిదలను వధించినా,మాంస విక్రయాలు జరిపినా అది చట్టరీత్యా నేరం. ఇందుకు పలు సెక్షన్ల కింద శిక్ష పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం గాడిద మాంస విక్రయం జోరుగా జరుగుతూనే ఉన్నాయి. అధికారులు కూడా దీనిపై పెద్దగా ఫోకస్ చేయట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు ఇకనైనా మేల్కొనకపోతే గాడిద కూడా భవిష్యత్తులో అంతరిస్తున్న జంతువుల జాబితాలో చేరుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.