ఆడపిల్లను కన్నదని ఒంటిపై కిరోసిన్ పోసి తగలబెట్టారు
అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దారుణం జరిగింది. వరుసగా రెండోసారి కూడా ఆడపిల్లను కన్నదనే కారణంతో కట్టుకున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పింటించిన ఘటన జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం పట్టింపాలెంలో చోటు చేసుకుంది.
బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... పెంటపాడు మండలం చింతపల్లికి చెందిన పోతుల పుల్లయ్య కుమార్తె సత్యవేణి(22). పట్టింపాలేనికి చెందిన కిక్కిరిశెట్టి గణేశ్ తో ఐదేళ్ల క్రితం ఆమెకు వివాహం జరిగింది. గణేశ్ తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
మద్యానికి, కోడి పందేలకు బానిసై నిత్యం తన వ్యసనాల కోసం డబ్బు ఇవ్వాల్సిందిగా భార్య సత్యవేణిని చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈ క్రమంలో బుద్ధి చెప్పాల్సిన తల్లిదండ్రులే తన కుమారుడు చేస్తున్న వేధింపులకు వత్తాసు పలికేవారు. కోడలిని ఇబ్బందులకు గురి చేసేవారు.
పెళ్లిరోజున ఇచ్చిన మూడు లక్షల రూపాయల కట్నం చాలదని, ఇంకా అదనపు కట్నం తీసుకుని రావాలని కోడలిని వేధించేవారు. తనపై వేధింపులు జరుగుతున్నా... సత్యవేణి పుట్టింటివారికి చెప్పకుండా గుట్టుగా కాపురం చేసుకొంటున్నది. ఈ క్రమంలో కృష్ణవేణికి తొలిసారి గ్రిష్మ అనే ఆడపిల్ల పుట్టింది.
దీంతో వేధింపులు మరింత పెరిగాయి. ఆరు నెలల క్రితం మరో ఆడపిల్లకు సత్యవేణి జన్మనిచ్చింది. దాంతో అత్తవారింటి వేధింపులు మరింతగా పెరిగాయి. ఈ క్రమంలో శనివారం తాగొచ్చిన గణేశ్, సత్యవేణితో గొడవపడ్డాడు. అర్ధరాత్రి వరకు కూడా కేకలు వినిపించాయని స్థానికులు తెలిపారు.
ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోంచి మంటలు రావడం చూసి, చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే సత్యవేణి మరణించింది. అయితే, భర్తతో గొడవ తరువాత మనస్తాపానికి గురై, నిప్పంటించుకొని సత్యవేణి ఆత్మహత్య చేసుకొన్నదని అత్తామామ, భర్త చెబుతున్నారు.
అయితే మృతురాలి నాలుక బయటకు వచ్చిన తీరుని బట్టి, గొంతు నులిమి చంపి, నిప్పుపెట్టి హత్య చేశారనిపిస్తోందని స్థానికులు అంటున్నారు. అంతేకాదు, కిరోసిన్ వంటిపై పోసుకొని ఉంటే శరీరమంతా కాలిపోతుందని, కానీ కాళ్ల భాగంలో ఎలాంటి గాయాలు లేవని చెబుతున్నారు.
నిప్పుపెట్టుకొన్న చోటే మృతదేహం పడి ఉండటంపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వరకట్న హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.