హైదరాబాద్లో వరద ముప్పు నివారణకు హైడ్రా యాక్షన్ ప్లాన్... 24 గంటలూ హైడ్రా సైన్యం సిద్ధం!
హైదరాబాద్ నగరంలో వర్షాకాలం వస్తుందంటే వాహనదారులకు భయం పట్టుకుంటుంది. ఏ రహదారి ముంపుకు గురవుతుందో, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందో అన్న ఆందోళన ఉంటుంది. ఈ క్రమంలో వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో వరద ముప్పును అడ్డుకోవడానికి హైడ్రా సంస్థ అప్రమత్తమైంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జలవిహార్లో నిర్వహించిన మాన్సూన్ రెస్పాన్స్ టీమ్ల ప్రత్యేక సమావేశంలో హైడ్రా అధికారులు, సిబ్బందికి ముఖ్యమైన దిశానిర్దేశం చేశారు.
హైడ్రా 24 గంటలూ అలర్ట్గా ఉండే యాక్షన్ ప్లాన్
మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. వర్షాకాలంలో చిన్నపాటి వానకు కూడా హైదరాబాద్లో వరదలు, నీరు నిల్వ ఉండటం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని హైడ్రా 24 గంటలూ అలర్ట్గా ఉండే యాక్షన్ ప్లాన్ను అమలు చేయాలని మంత్రి ఆదేశించారు.

సంబంధిత శాఖలు సమన్వయంతో పని చెయ్యాలన్న మంత్రి పొన్నం
వర్షాకాలానికి సంబంధించి 150 రోజుల పాటు సన్నద్ధంగా ఉండాలని సిబ్బందికి తెలిపారు. చెట్ల కొమ్మలు విరగడం, కరెంటు తీగలు తెగడం వంటి ప్రమాదాల నుంచి ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడం లక్ష్యంగా పని చేయాలన్నారు. ప్రభుత్వం, హైడ్రా, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసు, అగ్నిమాపక సిబ్బంది, వాతావరణ శాఖలు అన్నీ 24 గంటలూ సమన్వయంతో పని చేయాలని పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
300 మాన్సూన్ రెస్పాన్స్ బృందాలతో ప్లాన్
హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ, వర్షాకాల అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి 51 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు, 300 మాన్సూన్ రెస్పాన్స్ బృందాలు, 889 స్టాటిక్ టీమ్లు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. చెట్లు కూలిన సందర్భాల్లో వేగంగా స్పందించడానికి 20 బైక్ క్విక్ రెస్పాన్స్ యూనిట్లు, వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు తొలగించడానికి 371 డీ-వాటరింగ్ పంపులు సిద్ధం చేశామని చెప్పారు.
24/7 హైడ్రా సిద్దంగా ఉందన్న హైడ్రా కమీషనర్
అంతేకాదు, 60 ఫ్లైఓవర్లు, 38 అండర్పాస్లు మరియు 705 చెరువులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు, పార్కులు, ఇతర స్థలాలు ఆక్రమణల నుంచి కాపాడటంపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. నాలాల డీ సిల్టింగ్ పనులను వేగవంతం చేసి, వర్షపు నీరు సకాలంలో పోయేలా చర్యలు చేపదుతున్నామని హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. 24/7 హైడ్రా వరదను ఎదుర్కునేందుకు సిద్దంగా ఉందన్నారు.













Click it and Unblock the Notifications