తెలంగాణ ఓటర్లకు అలర్ట్.. సర్ గడువు మరోసారి పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్(SIR) ప్రక్రియ గడువు మరోసారి పొడిగించారు. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించే గడువు మరో నాలుగు రోజుల్లో అంటే ఆగస్టు 3 తేదీతో ముగియనుండగా దాన్ని ఆగస్టు 10 వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో ఓటర్ల నమోదు, వెరిఫికేషన్ ప్రక్రియ గడువును మరోసారి పెంచాలంటూ వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన ఎలక్షన్ కమిషన్ తాజాగా షెడ్యూల్ ను సవరించింది. తొలుత జూలై 24 వ తేదీతో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువు ముగుస్తుందనగా.. కేంద్ర ఎన్నికల సంఘం ఈ గడువును ఆగస్టు 3 వ తేదీకి పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఈ గడువును పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం.
ఇక ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా 77.19 శాతం ఎన్యూమరేషన్ పూర్తయిందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్ జిల్లాలో 56. 31 శాతం, అలాగే రంగారెడ్డి జిల్లాలో 63.43 శాతం, ఇక మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 61.37 శాతం ఎన్యూమరేషన్ పూర్తయినట్లు వివరించింది. ఇక జూన్ 25 నుంచి రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జరుగుతోంది. ఇంకా పూర్తికాకపోవడంలో జాప్యం జరుగుతోంది.
అయితే గ్రామాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే ఓటర్ల స్పందన మందకొడిగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండేసి చోట్ల ఓట్లు ఉన్నవారు.. అలాగే వలస వెళ్లిన వారు ఎన్యూమరేషన్ పత్రాలను నింపి తిరిగి ఇవ్వడంలో జాప్యం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు గ్రామాల్లోని ఓటర్లలో ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం ఇతర ప్రాంతాలు, పట్టణాలకు వెళ్లిన వారి పత్రాలు తిరిగి రాకపోవడమే ఆలస్యానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

ఇక కేంద్ర ఎన్నికల సంఘం ఈ గడువు పెంపుతో బూత్ స్థాయి ఏజెంట్లు, అర్హులైన ఓటర్లు తమ వివరాలను సరిచూసుకోవడానికి అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి తగిన సమయం దొరికినట్లు అయింది. భౌతికంగా లేదా ఆన్ లైన్ ద్వారా ఓటర్లు ఈ సవరణ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications