తప్పు ప్రచారం, ఇండస్ట్రియల్ హబ్గా హైదరాబాద్: ఈటెల
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ హబ్గా మారుతుందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. త్వరలో వందల సంఖ్యలో ఫార్మా కంపెనీలు వస్తాయని ఆయన చెప్పారు.
అర్హులైన ప్రతి పేదవాడికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆయన పౌరసరఫరాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. బుధవారం బ్యాంకర్లతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సమీక్ష నిర్వహిస్తారని ఆయన చెప్పారు. రుణమాఫీ సహా అన్ని విషయాలపై ఈ సమావేశంలో చర్చిస్తామని అన్నారు.
సున్నం రాజయ్య దీక్ష విరమణ
పోలవరం ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న భద్రాచలం శాసనసభ్యుడు సున్నం రాజయ్యను హైదరాబాదులోని నిమ్స్లో తెలంగాణ మంత్రులు నాయని నర్సింహా రెడ్డి, ఈటెల రాజేందర్ పరామర్శించారు. భద్రాచలంలో రాజయ్య దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆయనను నిమ్స్కు తరలించిన విషయం తెలిసిందే. నిమ్స్లో రాజయ్యను పరామర్శించిన మంత్రులు నాయని, ఈటెల ఆయన చేత దీక్షను విరమింపజేశారు.
ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని నిరసిస్తూ సున్నం రాజయ్య ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.