హోదాపై చంద్రబాబు కొత్త ట్విస్ట్: టీడీపీ-బీజేపీ నేతల 'దూకుడు'
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ - టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హోదా విషయంలో కేంద్రంపై తన అసంతృప్తి వ్యక్తం చేస్తూనే, కేంద్రంతో బెడిసి కొట్టకుండా ఉండాలనుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ చేసిన హేతుబద్ధత లేని విభజన వల్ల నేడు ఏపీ కష్టాలు ఎదుర్కొంటోందని, అయినా కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని చంద్రబాబు చెప్పారు. ఏపీ తొలి నుంచి కష్టాలు ఎదుర్కొంటోందని చెప్పారు.
మద్రాసు నుంచి కర్నూలు, కర్నూలు నుంచి హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చామని, నాడు చెన్నై, ఇప్పుడు హైదరాబాదును అభివృద్ధి చేసి కట్టుబట్టలతో వచ్చామని చంద్రబాబు అన్నారు. ఈ నేపథ్యంలో తాను ఆర్థిక సాయం కోసం పదేపదే ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పారు.
ప్రత్యేక హోదా కోసం తాను అడగడం లేదని తప్పుడు ప్రచారం చేస్తుండటం విడ్డూరమన్నారు. ఇప్పటి వరకు 11 రాష్ట్రాలకు హోదా ఇచ్చారని, కానీ పదేళ్లలో వారు సాధించిందేమీ లేనందున, హోదాతో పాటు అంతకంటే ఎక్కువ కావాలని కోరుతున్నానని ట్విస్ట్ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడనని చెప్పారు.
విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే అది వస్తుందని, ఇది వస్తుందని కొందరు ప్రజలను మభ్యపెడుతున్నారని, కానీ హోదా తేవడమంటే అంత ఈజీ కాదని చెప్పారు.

చంద్రబాబు ప్రత్యేక హోదా, కేంద్ర నిధుల పైన తన అసంతృప్తిని, అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. అయితే, కేంద్రంతో సఖ్యతతో ఉంటేనే కొత్త రాష్ట్రమైన ఏపీకి నిధులు వస్తాయని, ఆదుకుంటుందని ఆయన కొంత మౌనంగా ఉంటున్నారని చెప్పవచ్చు.
అయితే, బీజేపీ, టీడీపీ నేతల మధ్య మాత్రం మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కలు చెప్పాలని, చంద్రబాబు తన హామీలను ఏ మేరకు నెరవేర్చారని, టిడిపి వైఫల్యానని కేంద్రం పైన రుద్దాలని చూస్తున్నారని ఏపీ బీజేపీ నేతలు సోము వీర్రాజు వంటి నేతలు భగ్గుమంటున్నారు.
వారిపై టిడిపి నేతలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. తాజాగా, మంత్రి అయ్యన్న పాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా పైన బీజేపీ దొంగాట ఆడుతోందని ధ్వజమెత్తారు. మిగతా టిడిపి నేతలు కూడా హోదా విషయంలో బీజేపీని నిలదీస్తున్నారు.
ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని కేంద్రమంత్రులు చెప్పినా, ఏపీ బీజేపీ నేతల అంతర్గాత సమావేశాల్లో ఏపీ ఇంచార్జ్ కూడా అదే విషయం చెప్పినప్పటికీ ప్రత్యేక హోదా సాధిస్తామని టిడిపి నేతలు చెప్పడం ఏమిటని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. హోదా విషయంలో ఏపీ నేతలు మాత్రం దూకుడుగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉండగా, ప్రత్యేక హోదా రాదని చంద్రబాబుకు ముందే తెలుసునని ఇటీవల కొందరు నేతలు ఘాటుగా విమర్శిస్తున్నారు. ఆయనకు ముందే తెలుసునని, అందుకే ప్యాకేజీ మాత్రమే అడుగుతున్నారని చెబుతున్నారు. అయితే, హోదాతో లాభం లేదని, దాంతో పాటు ప్యాకేజీ అడుగుతున్నానని ఆయన అంటున్నారు.












Click it and Unblock the Notifications