‘నేను బరిలో దిగనంత వరకే’: గెలుపుపై బాలకృష్ణ
అనంతపురం: రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనించాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ పార్టీ నేత, హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి బాలకృష్ణ అన్నారు. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తన గెలుపునకు సహకరించిన ప్రతీ ఒక్కరిక కృతజ్ఞతలు తెలుపున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన తన ‘లెజెండ్' సినిమాలోని ఓ డైలాగును చెప్పారు. ‘పొజిషనైనా.. అపొజిషనైనా.. నేను బరిలోకి దిగనంత వరకే.. ఒక్కసారి బరిలోకి దిగితే' అని బాలకృష్ణ చాలా ఉత్సాహంగా డైలాగును చెప్పారు. తాను ఇంతకుముందే హిందూపురం నుంచి పోటీ చేస్తానని చెప్పానని, ఇప్పుడు పోటీ చేస్తే తనను ప్రజలు ఆదరించి గెలిపించారని తెలిపారు. తన గెలుపునకు సహకరించిన ప్రతీ ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం, హిందూపురం అభివృద్ధి బాటలో పయనిస్తుందని చెప్పారు. త్వరలోనే తాను హిందూపురంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి వెల్లడిస్తానని చెప్పారు. తమ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అందరి సహకారంతో నెరవేరుస్తామని తెలిపారు. టిడిపి ప్రభుత్వంలో ఏదైనా కీలక పదవి చేపడతారా అని ప్రశ్నించగా.. అధిష్టానంతో చర్చించిన తర్వాత చెబుతానని అన్నారు.
తాను ఇక నుంచి ప్రజా సేవకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తామని బాలకృష్ణ తెలిపారు. తెలుగుజాతిని కాపాడేందుకే తెలుగుదేశం పార్టీ పుట్టిందని చెప్పారు. తెలుగుజాతికి అన్యాయం జరుగుతుందని గుర్తించిన ప్రజలు.. తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెడుతున్నారని తెలిపారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కోరుకున్న ప్రజలు టిడిపికి అధికారం కట్టబెట్టారని, వారి నమ్మకాన్ని నిలబెడతామని బాలకృష్ణ చెప్పారు.