గందరగోళం, హిచ్కాక్ సినిమా గుర్తుకొస్తుంది: జయసుధ
అంతా అయోమయంగా ఉందని, ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సినిమా గుర్తుకు వస్తోందని అన్నారు. బుధవారం ఆమె ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జయసుధ పైవిధంగా స్పందించారు.
ఎన్ని కుట్రలు చేసినా ఆగదు: హరీష్
బిల్లును చర్చ జరపకుండా అడ్డుకోవాలనే కిరణ్ శాసనసభ వ్యవహారాల శాఖను శ్రీధర్ బాబు నుంచి తొలగించాడని , ఎన్ని కుట్రలు పన్నినా, ఆయన తలకిందులుగా తపస్సు చేసినా రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగదని తెరాస శాసనసభ పక్ష ఉపనేత హరీశ్ రావు అన్నారు. బుధవారం మెదక్ జిల్లాలో మాట్లాడారు. శాసనసభలో బిల్లుపై చర్చ ప్రారంభం జరిగిందని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించగానే అప్పటి నుంచి సభవాయిదా వేశారన్నారు.
ఎలాగైనా బిల్లుపై చర్చలు జరపకుండా కుట్రలు పన్నుతున్న సిఎం ఏకంగా ఆ శాఖను సమైక్యాంధ్ర ఐకాస నేత మంత్రి శైలజానాథ్కు అప్పగించాడన్నారు. పాలన పగ్గాలు ఆంధ్రావారి చేతిలో ఉన్నాయని, డిప్యూటీ బతుకులు తెలంగాణ వారివి అన్నారు. సిఎం, స్పీకర్ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారని, డిప్యూటీ సిఎం, డిప్యూటీ స్పీకర్ తెలంగాణ ప్రాంతం వారన్నారు. ఉన్న ఒక్కగానొక్క తెలంగాణ ప్రాంతానికి చెందిన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిని తొలగించారన్నారు.
విభజనను అడ్డుకునేందుకు కిరణ్, చంద్రబాబులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చాక బ్రిటీష్ వారు ఎలాగైతే దేశ సంపదను ఓడల్లో అక్రమంగా తరలించుకెళ్లారో విభజన సమయంలో కిరణ్ అదే విధంగా ప్రవర్తిస్తున్నాడన్నారు. ఆంధ్రా ప్రాంతానికి నీటి పథకాల కోసం ఆరు వేల కోట్ల రూపాయలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసం రూ.180 కోట్లు తరలించుకెళ్తున్నాడన్నారు.