ఆ ఎమ్మెల్యే టికెట్ రేసులో నేను కూడా ఉన్నా!...టిడిపి మాజీ ఎమ్మెల్సీ సంచలన ప్రకటన
అనంతపురం:తెలంగాణా ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ఎమ్మెల్యే సీట్ల కేటాయింపు వ్యవహారంలో అసంతృప్తి జ్వాలలు చవిచూస్తున్న టిడిపికి తాజాగా ఎపి నుంచి కూడా సీట్ల తకరారు సెగ తగలడం మొదలైంది.
గెలిచిన తొలిసారే అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్న రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు చంద్రబాబు కేబినెట్ లో చురుగ్గా వ్యవహరిస్తూ మంచి గుర్తింపు పొందుతున్నా నియోజకవర్గం రాజకీయాల విషయానికొచ్చే సరికి కొరుకుడు పడని స్థితి ఎదుర్కొంటున్నారు. తాజాగా ఒక టిడిపి నేత చేసిన ప్రకటన మంత్రి కాల్వ శ్రీనివాసులుని మరింత అశాంతికి గురిచేసేలా ఉండటం అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
బుధవారం రాయదుర్గం మండలం హనుమాపురంలో పర్యటన సందర్భంగా టిడిపి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో రాయదుర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు తాను కూడా రేసులో ఉన్నానంటూ సంచలన ప్రకటన చేశారు. రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కూడా అయిన మెట్టు గోవిందరెడ్డి అనూహ్యంగా చేసిన బహిరంగ ప్రకటన తెలుగు దేశం పార్టీలో కలకలం రేపుతోంది.
హనుమాపురంలో మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం తనకు టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా ఏంటో చూపిస్తానని సవాలు విసిరారు. ప్రజాసేవలో మరింత సమయం గడపాలని, ఇంకా చురుకైన పాత్ర పోషించాలనే ఉద్దేశంతో రాయదుర్గంలోనే ఇల్లు కట్టుకుని ఇకమీదట ఇక్కడే గడపబోతున్నానని ఆయన చెప్పుకొచ్చారు.
ఇదిలావుంటే మంత్రి కాల్వ శ్రీనివాసులుకు రాయదుర్గం నియోజకవర్గంలో పరిస్థితి అనుకూలంగా లేదని సిఎం సర్వేలో తేలడంతో ఆయనను ఆ నియోజకవర్గం నుంచి తప్పించి మరో చోట స్థానం కల్పిస్తారనే ప్రచారం ఇప్పుడు మరోసారి తెరమీదకు వస్తోంది. అయితే మంత్రి కాల్వ శ్రీనివాసులు మాత్రం ఏ విధమైన ప్రకటనలు చేయకుండా సిఎం చంద్రబాబే తన రాజకీయ భవిష్యత్తుకు భరోసా కల్పిస్తారనే ధీమాతో ఉన్నారట.