అప్పట్లో నా ప్రయత్నాన్ని వైసీపీ అడ్డుకుంది: నారా లోకేష్, ఏపీలో కొలువుదీరిన కొత్త మంత్రులు
ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు తాను మంత్రిని కాకమునుపే ప్రయత్నించానని, కానీ అప్పట్లో తన ప్రయత్నాలను వైసీపీ అడ్డుకుందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు.
అమరావతి: ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు తాను మంత్రిని కాకమునుపే ప్రయత్నించానని, కానీ అప్పట్లో తన ప్రయత్నాలను వైసీపీ అడ్డుకుందని ఐటీ, పంచాయితీ రాజ్ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఇప్పుడిక మంత్రి హోదాలో అధికారికంగా పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తానని చెప్పారు.
పని విషయంలో తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే తనకు పోటీ అని, ఐటీ పరిశ్రమతో తనకు ఉన్న పరిచయాలతో ఏపీకి పెట్టుబడులను ఆకర్షిస్తానని, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
సీటెక్కిన కొత్త మంత్రులు...
చంద్రబాబు మంత్రివర్గంలో కొత్తగా చేరిన పలువురు మంత్రులు నేడు బాధ్యతలు స్వీకరించడంతో వెలగపూడి సచివాలయం ప్రాంతంలో సందడి నెలకొంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులకు పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు శుభాభినందనలు తెలిపారు.
వ్యవసాయ శాఖ మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గ్రామీణ గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రిగా కాల్వ శ్రీనివాసులు, రహదారులు, భవనాల శాఖ మంత్రిగా అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించారు.
మార్కెటింగ్, సహకార, పశుసంవర్థక, మత్స్య, గిడ్డంగుల శాఖ మంత్రిగా ఆదినారాయణరెడ్డి కొద్దిసేపటి క్రితం బాధ్యతలు స్వీకరించగా.. ఐటీ, పంచాయితీ రాజ్ మంత్రిగా నారా లోకేష్ రేపు బాధ్యతలు చేపట్టనున్నారు.
ఆదినారాయణ రెడ్డికి ఇంకా చాంబర్ కేటాయించకపోవడంతో ఆయన ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ చాంబర్ లో కూర్చుని అధికారులతో తన తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. సాధ్యమైనంత త్వరలో అందరు మంత్రులకూ చాంబర్లను కేటాయిస్తామని సచివాలయం అధికారులు తెలిపారు.