ఆనంతో బుట్టా రేణుక భేటీ - పార్టీ మార్పు పై క్లారిటీ..!!
ఏపీలో కొత్త రాజకీయం మొదలైంది. వైసీపీ ఎన్నికల్లో పరాజయం పాలైంది. టీడీపీ కూటమి ప్రభుత్వం పాలన మొదలైంది. కొత్త అసెంబ్లీ రేపు కొలువు తీరనుంది. శాఖల ఖరారు తరువాత మంత్రులు ఈ రోజుతో తమ బాధ్యతల స్వీకరణ పూర్తి చేసారు. ఇక, జగన్ పార్టీ నేతలతో సమీక్ష చేసారు. భవిష్యత్ నిర్దేశించారు. ఇదే సమయంలో వైసీపీ నేత బుట్టా రేణుక మంత్రి ఆనంతో భేటీ అయ్యారు. పార్టీ మార్పు పైన ప్రచారం పైన స్పష్టత ఇచ్చారు.
ఆనంతో బుట్టా భేటీ
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ఇటు కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం పాలనా పరంగా నిర్ణయాల్లో బిజీగా ఉంది. పార్టీ నేతలతో ఇటు మాజీ సీఎం జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ఓటమి కారణాలను విశ్లేషించారు. పార్టీ కేడర్ కు అండగా నిలవాలని సూచించారు. ఇదే సమయంలో మంత్రి ఆనం తో వైసీపీ నుంచి ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన బుట్టా రేణుక కలిసారు. విజయవాడలోన జరిగిన ఈ భేటీ ఫొటోలు వైరల్ అయ్యాయి. బుట్టా రేణుక మరోసారి టీడీపీలో చేరుతున్నారనే ప్రచారం మొదలైంది.

పార్టీ మార్పు ప్రచారం
బుట్టా రేణుక 2014లో వైసీపీ నుంచి కర్నూలు ఎంపీగా గెలుపొందారు. ఆ తరువాత రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ నుంచి పార్టీ మారిన ముగ్గురు ఎంపీల్లో బుట్టా రేణుక ఉన్నారు. తిరిగి రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మరోసారి వైసీపీలో చేరారు. తాజా ఎన్నికల్లో ఎమ్మిగనూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక..ఇప్పుడు మరోసారి టీడీపీ అధికారంలోకి రావటంతో బుట్టా అదే రకంగా ఆ పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు వచ్చిన ఆనంతో సమావేశమయ్యారు.
బుట్టా రేణుక క్లారిటీ
తాను ఆనం కలవటం...పార్టీ మారటం పైన బుట్టా రేణుక స్పష్టత ఇచ్చారు. తాను మాజీ సీఎం జగన్ సమావేశంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చానన్నారు. తాను బస చేసిన హోటల్ లోనే మంత్రి ఆనం కూడా బస చేసారని..ఆయన మంత్రి బాధ్యతలు స్వీకరించే ముందు అక్కడ ఉన్నారని వివరించారు. తనకు ఆనం కుటుంబంతో చాలా కాలంగా స్నేహం ఉందని చెప్పుకొచ్చారు. ఆ పరిచయంతో మాత్రమే తాను అన్న గా పిలుచుకొనే ఆనంను మర్యాద పూర్వకంగా కలవటం జరిగిందని చెప్పారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని బుట్టా రేణుక స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications