దేశంలో నేనే సీనియర్.. నాకు సమకాలీనులు ఎవరూ లేరు!: చంద్రబాబు
తొమ్మిదిన్నరేళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా.. ప్రస్తుతం మళ్లీ సీఎంగా ఉన్న నాయకుడు దేశ రాజకీయాల్లో తాను తప్ప మరెవరూ లేరన్నారు.
చిత్తూరు: సందర్బం దొరికిన ప్రతీసారి తన గురించి గొప్పగా చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి తన రాజకీయ స్థాయి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేతను తానేనని, తనకు సమకాలీనులు మరెవరూ లేరని చంద్రబాబు అన్నారు.
కేంద్రంలో ఐకె గుజ్రాల్, వాజ్ పేయి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పానని గుర్తుచేసుకున్నారు. తొమ్మిదిన్నరేళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా.. ప్రస్తుతం మళ్లీ సీఎంగా ఉన్న నాయకుడు దేశ రాజకీయాల్లో తాను తప్ప మరెవరూ లేరన్నారు.
గురువారం నాడు చిత్తూరు జిల్లా కుప్పంలో ఏర్పాటు చేసిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ హయాంలో కుప్పం నియోజకవర్గం నిరాదరణకు గురైందని పేర్కొన్నారు.
రాష్ట్రం విడిపోయిన తర్వాత నష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందకు బస్సు నుంచే పరిపాలన చేశానని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఎన్డీయేలో కొనసాగుతున్నామని చంద్రబాబు చెప్పారు.
ఎలక్షన్ కోడ్ విస్మరించిన చంద్రబాబు:
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందునా ప్రస్తుతం ప్రభుత్వం ఎలాంటి హామిలు ఇవ్వడానికి వీల్లేదు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఓవైపు ఈ విషయాన్ని గుర్తుచేస్తూనే..మరోవైపు వరాలు ప్రకటించడం గమనార్హం.
ఇంటింటికి మినరల్ వాటర అందిస్తానని చంద్రబాబు అక్కడి ప్రజలకు హామి ఇచ్చారు. ఎంత డబ్బు ఖర్చయినా సరే కుప్పంలో ప్రపంచ స్థాయి వాణిజ్య భవనాన్ని నిర్మిస్తానని పేర్కొన్నారు. ఇప్పటికే బ్రిటానియా లాంటి కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని, కుప్పంలో నిరుద్యోగం లేకుండా చేసేందుకు మరికొంతమంది పారిశ్రామికవేత్తలను సంపద్రిస్తున్నామని తెలియజేశారు.
మంత్రుల అలసత్యంపై చంద్రబాబు ఆగ్రహం:
తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయకపోవడం పట్ల మంత్రులు నారాయణ, సిద్దారాఘరావులపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. కుప్పంలోని స్థానిక ఆర్&బీ గెస్ట్ హౌజ్ లో ఇదే విషయమై ఆయన మంత్రులతో మాట్లాడారు.