ఏపీ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్లో కుమారుడిని చేర్పించిన ఐఎఎస్ అధికారిణి
పార్వతీపురం మన్యం: తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే ఐఎఎస్ అధికారుల సంఖ్య ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఇదివరకు ఏపీ స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి తన ఇద్దరు పిల్లలను విజయవాడ పటమటలోని జిల్లా పరిషత్ స్కూల్లో జాయిన్ చేయించారు. అంతకుముందు- నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా పని చేసిన ప్రభాకర్ రెడ్డి.. అప్పుడు కూడా తన పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లోనే చదివించారు.
ఇటీవలే కర్నూలు జిల్లా కలెక్టర్ పీ కోటేశ్వర రావు తన కుమారుడిని ఆంగన్వాడిలో చేర్పించారు. కర్నూలు బుధవార పేటలోని అంగన్వాడీ ప్రీ స్కూల్లో తన కుమారుడు దివి ఆర్విన్ను ఆయన జాయిన్ చేయించారు. అంగన్ వాడి కేంద్రాలలో అందుతున్న సదుపాయాలతో పాటు విద్యా బోధన సంతృప్తికరంగా ఉందని, అందుకే తన కుమారుడిని జాయిన్ చేయించినట్లు చెప్పారు. స్వయంగా ఆయన అక్కడి పరిస్థితులను సమీక్షించారు.
ఇప్పుడు ఇదే జాబితాలో మరో ఐఎఎస్ అధికారి చేరారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పని చేస్తోన్న బీ నవ్య.. తన కుమారుడిని గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించారు. తాను కూడా గవర్నమెంట్ ఎయిడెడ్ పాఠశాలలోనే చదువుకొన్నానని, ఐఎఎస్ స్థాయికి ఎదిగానని అన్నారు. తన కుమారుడు బీ శ్రీకర్ ప్రతీక్ ఆరో తరగతి చదువుతున్నాడని చెప్పారు.
సీతంపేట మల్లి ప్రాంతంలో ఉన్న గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించానని అన్నారు. ప్రభుత్వం విద్యా రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవటానికి అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు, వసతులను కల్పిస్తోందని పేర్కొన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్కు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకున్నాయని అన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తోన్న నాడు-నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని నవ్య వ్యాఖ్యానించారు. అన్ని చోట్లా ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన వల్ల భాషపై విద్యార్థులకు పాఠశాల దశ నుంచి మంచి పట్టు ఏర్పడుతుందని, అది వారి కేరీర్ను ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. మల్లి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో సౌకర్యాలు బాగున్నాయని కితాబిచ్చారు.