బీకేర్ ఫుల్ - ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే..!!
తెలుగు రాష్ట్రాల్లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కొద్ది రోజులు ఎండ తీవ్రత..వడ గాలులతో అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు రేపు వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలోని 116 మండలాల్లో వడగాల్పులు ఉంటాయని అంచనా వేసింది. అదే విధంగా తెలంగాణలో నేడు, రేపు 41-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అలర్ట్ చేసింది.

రోజురోజుకు ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి.రాష్ట్రంలో నేడు వడగాల్పుల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఏపీ అంతటా ఈ రోజు, రేపు ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. 116 మండలాల్లో, మంగళవారం 61 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుందని అలర్ట్ జారీ చేసింది. తూర్పుగోదావరి 8, ఏలూరు, గుంటూరు6, కాకినాడ 9, కృష్ణా 6, నంద్యాల 4, ఎన్టీఆర్ 15, పార్వతీపురం మన్యం 10. శ్రీకాకుళం 3, విశాఖ పట్నం 1, విజయనగరం 13, వైఎస్ఆర్ 13 మండలాల్లో వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇదే సమయంలో తెలంగాణలో నేడు, రేపు 41-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. దీంతోపాటు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఎండ సమయంలో ఎవరూ బయటకు వెళ్లద్దని సూచించింది. బయటకు వెళ్లిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఏపీలోనూ మరో రెండు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు. దీని కారణంగా ఒకట్రెండు చోట్ల ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications