ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన: పిడుగులు పడే ఛాన్స్
AP Rains: ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు పడుతోన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కొద్ది రోజులుగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతూ వస్తోంది. ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. కొన్నిచోట్ల వడగండ్ల వాన కురిసింది.
ఇదే పరిస్థితి మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశాలు లేకపోలేదు. ఈ నెల 16వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షలు కురిపే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లో వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ, ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థలు వెల్లడించాయి.

నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకావం ఉంది. ఆయా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చు.
రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. కడప, అన్నమయ్య రాయచోటి, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చు.
సోమవారం నాడు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో అత్యధికంగా 57.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లా కనిగిరి- 52.5, శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి- 46.5, బాపట్ల జిల్లా అద్దంకి- 38.5, ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం- 38 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదైంది. సుమారు 27 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం పడింది.












Click it and Unblock the Notifications