AP Weather: రేపు ఈ జిల్లాలో వర్షాలే వర్షాలు..! ఐఎండీ అలర్ట్..!
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం (AP Weather) ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే రెండు రోజులుగా ఈ ఆవర్తన ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు (Rains) కురుస్తున్నాయి. ఇదే క్రమంలో రేపు కూడా పలు జిలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని (Rain Alert) వాతావరణ విభాగం హెచ్చరించింది. కాబట్టి ఆయా జిల్లాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఈదురుగాలులు వీచే ప్రాంతాల్లో అలర్ట్ గా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు (శుక్రవారం) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురవబోతున్నాయి. వీటిలో ఉత్తరాంధ్రతో మొదలుపెడితే శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అలాగే విజయనగరం, పోలవరం, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లోనూ చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

ఏపీలోని ఆయా జిల్లాల్లో వర్షాల ప్రభావంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంది. కాబట్టి ఉరుములు, మెరుపులతో వర్షం పడే సమయంలో చెట్లు, పోల్స్, హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని విపత్తుల నిర్వహణ విభాగం సూచిస్తోంది. ఆయా జిల్లాల్లో ఇప్పటికే ఎల్ నినో ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇవి కాస్త ఊరటనిచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో భారీ వర్షాలు కురిస్తే మాత్రం వారికి ఇబ్బందులు తప్పవు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూతో పాటు వ్యవసాయశాఖ అధికారుల్ని సైతం అప్రమత్తం చేస్తోంది. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్లు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.




Click it and Unblock the Notifications