అల్పపీడనం ఎఫెక్ట్ - ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు..!!
తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావంతో లోటు వర్షపాతం రెండు రాష్ట్రాల్లోనూ నమోదైంది. అప్పుడప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని పలు ప్రాంతాల్లో గత వారం రికార్డు స్థాయిలో నమోదైన ఉష్ణోగ్రతలతో రెండో వేసవి సీజన్ గా పరిస్థితి మారింది. కాగా, తాజాగా వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో అల్ప పీడన ప్రభావంతో ఏపీ లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాల పై వాతావరణ శాఖ కీలక సమాచారం అందించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపటికి వాయువ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్-ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, మిగతా ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వర్షాలకుతోడు ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

రెండు రోజులు వర్షాలు
అదే విధంగా వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగులు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. రైతులు వ్యవసాయ పనులు, పంట సంరక్షణ విషయంలో వాతావరణ శాఖ హెచ్చరికలను పరిగణలోకి తీసుకోవాలని అధికారులు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడక్కడా అప్పుడప్పుడు వర్షాలు కురుస్తున్నా.. అశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. రైతులు పంటల సాగులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో సాగుచేసిన పంటలకు నీరు అందక ఎండిపోతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో రైతులు ఇప్పటి వరకు సాగు పనుల్లో పూర్తిస్థాయిలో నిమగ్నం కాలేదు. దీంతో.. ప్రత్యామ్నాయ పంటల వైపు చూడాలని రైతులకు సూచిస్తున్నారు.













Click it and Unblock the Notifications