జగన్ కోడికత్తి కేసులో మరో కీలక పరిణామం-విచారణపై హైకోర్టు 8 వారాల స్టే..
ఏపీలో వైఎస్ జగన్ కోడికత్తి కేసు విచారణలో ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసును దర్యాప్తు చేసిన ఎన్ఐఏ ఇందులో కుట్ర కోణం లేదని తేల్చేసింది. అయితే ఈ కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పు వెలువడకముందే విజయవాడ నుంచి వైజాగ్ కు ఈ కేసు విచారణ మారడం, అదే సమయంలో జగన్ ఈ కేసులో సమగ్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ వేయడం, దాన్ని కోర్టు తోసిపుచ్చడంతో హైకోర్టును ఆశ్రయించడం చకచకా జరిగిపోయాయి.
ఈ నేపథ్యంలో ఇవాళ జగన్ కోడి కత్తి కేసుపై సమగ్ర దర్యాప్తు చేయించాలన్న పిటిషన్ పై విచారణ ప్రారంభించిన హైకోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది. వైజాగ్ ఎన్ఐఏ కోర్టులో జరుగుతున్న కోడి కత్తి కేసు విచారణను ఏకంగా 8 వారాల పాటు నిలిపేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఎన్ఐఏ కోర్టులో విచారణ హైకోర్టు ఆదేశాల తర్వాతే తిరిగి ప్రారంభం కానుంది. అయితే హైకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక జగన్ దాఖలు చేసిన పిటిషనే కారణంగా తెలుస్తోంది.

ఎన్ఐఏ అధికారులు కోడికత్తి దాడి వెనుక ఎలాంటి కుట్ర కోణం లేదని తేల్చడంపై వైఎస్ జగన్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎన్ఐఏ సమగ్రంగా దర్యాప్తు చేయలేదని, ముఖ్యంగా నిందితుడి నేరచరిత్రను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. కాబట్టి దీనిపై పూర్తిగా విచారణ చేయించాలని కోరారు. దీంతో ఎన్ఐఏ అభిప్రాయాలు తెలుసుకుని దీనిపై హైకోర్టు తుది నిర్ణయం వెలువరించాల్సి ఉంది. కాబట్టి అప్పటివరకూ ఎన్ఐఏ కోర్టు ఎలాంటి తుది తీర్పు ఇవ్వకుండా ఈ విచారణను హైకోర్టు ప్రస్తుతానికి నిలిపేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్ బెయిల్ పైనా ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్ఏఐ కోర్టులో ఈ కేసు తేలకపోవడంతో పాటు హైకోర్టులోనూ జగన్ పిటిషన్ విచారణ సాగుతున్న నేపథ్యంలో శ్రీనివాస్ కు బెయిల్ ఇవ్వాలని ఆయన లాయర్లు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications